PS 2: రాజ‌మౌళి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు

Hyderabad: క్లాసిక్​ డైరెక్టర్​ మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమా రెండో భాగం రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని భారీగా పాన్ ఇండియా రిలీజ్ చేశారు. విక్రమ్(Vikram), కార్తీ(Karthi), జయం రవి(Jayam Ravi), త్రిష(Trisha), శోభిత(Shobitha Dhulipala), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachchan), ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం వంటి స్టార్లతో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించినప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 రాబోతుంది. ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం దేశమంతా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పొన్నియిన్ సెల్వన్ చిత్రయూనిట్ ఆదివారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో మణిరత్నం మాట్లాడుతూ మరోసారి బాహుబలి(Balubali)ని, రాజమౌళి(Rajamouli)ని పొగిడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇదివరకే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు. రాజమౌళి బాహుబలిని 2 పార్టులుగా తీయకపోతే పొన్నియిన్ సెల్వన్ సినిమా వచ్చేది కాదు. ఇదే విషయాన్ని నేను రాజమౌళిని కలిసి కూడా చెప్పాను. రాజమౌళి బాటలోనే మేము వెళ్తున్నాము. రాజమౌళి భారీ మార్కెట్ కు, మన కథలు చెప్పడానికి బాటలు వేశారు. ఆయన అలా చేయడం వల్లే మేము ఇప్పుడు ముందుకు వచ్చాము. మేము కూడా రెండు పార్టులుగా సినిమా చేయగలిగాం. బాహుబలి తీసినందుకు రాజమౌళికి థాంక్స్​’ అని అన్నారు.