Mansoor: త్రిష నాతో న‌టించ‌నంది.. నేనే ప‌రువు న‌ష్టం దావా వేస్తా

Mansoor Ali Khan: ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ త్రిష‌పై (trisha) అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే కాకుండా సారీ కూడా చెప్పేందుకు సిద్ధంగా లేనంటున్నారు. పైగా త‌న వ్యాఖ్య‌ల్లో ఎలాంటి త‌ప్పు లేద‌ని ఎందుకు సారీ చెప్పాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు పోలీసులు మ‌న్సూర్‌పై కేసు పెట్టారు. ఇంత జ‌రిగినా తాను క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌బోమ‌న‌ని.. నిజానికి త్రిష త‌న‌తో క‌లిసి న‌టించ‌ను అని చెప్పి త‌న ప‌రువు తీసింది కాబ‌ట్టి తానే త్రిష‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని అంటున్నారు.

ఏం జ‌రిగింది?

మ‌న్సూర్ అలీ ఖాన్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎన్నో సినిమాల్లో విల‌న్‌గా హీరోయిన్ల‌ను రేప్ చేసిన సీన్ల‌లో న‌టించాన‌ని.. కానీ త్రిష‌తో అలాంటి సీన్‌లో న‌టించే అవ‌కాశం ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదుర‌చూస్తున్నాన‌ని అన్నారు. ఈ వీడియో త్రిష కంట ప‌డ‌టంతో ఆమె మండిప‌డ్డారు. ఇలాంటి వ్య‌క్తులు మ‌గజాతికే మ‌చ్చ తెస్తార‌ని… దేవుడి ద‌య వ‌ల్ల తన‌కు ఇలాంటి నీచ‌మైన వ్య‌క్తితో క‌లిసి న‌టించే అవ‌కాశం రాలేద‌ని అన్నారు. భ‌విష్య‌త్తులోనూ ఇత‌నితో క‌లిసి న‌టించ‌న‌ని చెప్పారు. ఈ వివాద నేప‌థ్యంలో చిరంజీవి, నితిన్, ఖుష్బూ, లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌దిత‌రులు త్రిష‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు.

త‌మ‌న్నా విష‌యంలోనూ..

మ‌న్సూర్ హీరోయిన్ల‌పై త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయ‌డం ఇది కొత్తేం కాదు. త‌న సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు చాలా క‌ట్స్ ఇచ్చింద‌న్న కోపంతో జైల‌ర్ (jailer)  సినిమాలో త‌మ‌న్నా (tamanna) కావ‌ల‌య్యా (kavalayya) పాట‌లో ఎంత సిగ్గుచేటుగా డ్యాన్స్ చేసినా సెన్సార్ బోర్డుకు త‌ప్పు అనిపించ‌లేదు అని కామెంట్స్ చేసారు.