Major: అడివి శేష్​ను అభినందించిన మాజీ రాష్ట్రపతి!

Hyderabad: అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మేజర్ (Major). 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. పోయినేడాది మే 22వ తేదీన విడుదలైన మేజర్ సినిమా రికార్డులు సృష్టించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. మేజర్‌‌ సినిమాలోని ఉన్ని కృష్ణన్ భార్య పాత్రలో సయీ మంజ్రేకర్ నటించారు.
థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న మేజర్ సినిమా ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించింది. సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. మేజర్ సినిమా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. మేజర్‌‌ సినిమాలో సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ క్యారెక్టర్ చేసి మెప్పించిన అడివి శేష్‌ను మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్ (Ram Nath Kovind) అభినందించారు. కాసేపు శేష్‌తో మాట్లాడి చిత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
రామ్‌నాథ్ కోవింద్ ను కలిసిన వీడియోని అడివి శేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మేజర్ సినిమా రిలీజై సంవత్సరం గడుస్తోంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ మమ్మల్ని ఇప్పటికీ ఆశీర్వదిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారిని కలిశాను. మేజర్ సినిమా చూసి దాని గురించి మాట్లాడారు. అది జీవితంలో మర్చిపోలేను. నా లైఫ్ లో ఇదొక మర్చిపోలేని మూమెంట్’ అంటూ ఎమోషనల్ గా పోస్టు చేశారు. దీంతో అడివి శేష్ ను మరోసారి అందరూ అభినందిస్తున్నారు. ఇక, శేష్ ప్రస్తుతం గూడాచారి 2 సినిమాలో నటిస్తున్నారు.