Mahesh Babu: ఆ 3 సినిమాలే నా కెరీర్‌ను మ‌లుపు తిప్పాయ్‌

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం, ‘గుంటూరు కారం’, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అయితే విచిత్రంగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక విజయాన్ని సాధించింది. గ్లోబల్ చార్ట్ లో టాప్ ప్లేస్ లో కొనసాగి సత్తా చాటింది. అయితే గుంటూరు కారంతో పాటు గత కొన్నేళ్లలో తను నటించిన సినిమాల గూర్చి మహేష్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తన కెరీర్ లో ఎక్కువగా ప్రభావితం చేసిన ప్రాజెక్ట్‌ లు ఏంటని అడిగినప్పుడు, మహేష్ బాబు “మురారి,” “పోకిరి,” “శ్రీమంతుడు” చిత్రాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. “ఈ సినిమాలు నా ప్రయాణంలో కీలకమైనవి, అవి నన్ను విభిన్న కథలను ఎంచుకోవడంతో పాటు ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవ్వడానికి అనుమతించాయి.” అన్నారు మహేష్ బాబు.

మురారి సినిమా నటుడిగా మహేష్ ను ఒక మెట్టు ఎక్కిస్తే, పోకిరి అటు నటనకు ప్రశంసలతో పాటు బాక్సాఫీసు వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి స్టార్డం కూడా తెచ్చిపెట్టింది. 2015లో వచ్చిన శ్రీమంతుడు మహేష్ బాబు చివరి యునానిమస్ బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. మురారి సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు కాగా, పోకిరి సినిమాకు పూరీ జగన్నాథ్, శ్రీమంతుడు సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. (Mahesh Babu)

ALSO READ: Mahesh Babu: మార్చి నుంచి ఇన్‌కాగ్నిటో మోడ్‌లోకి..!

ఈ మూడు సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేశాయనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు అభిమానులలో మెజారిటీ అభిమానులకు సైతం ఈ సినిమాలే ఇష్టమైన సినిమాలు కావడం గమనార్హం. అయితే శ్రీమంతుడు తర్వాత గత ఏళ్లలో ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులతో పాటు తన అంచనాలను కూడా అందుకోవడంలో విఫలమయ్యాయనే చెప్పాలి. కలెక్షన్ల పరంగా గత నాలుగు సినిమాలు వంద కోట్ల మైలురాయిని దాటినా… కంటెంట్ పరంగా ఇప్పటికీ శ్రీమంతుడుని దాటే సినిమాని మహేష్ చేయలేదు.

ఇక తదుపరి చిత్రం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. తన తదుపరి సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మహేష్ తెలిపారు. సినిమాకు సంబంధించిన సన్నాహాలు బాగా జరుగుతున్నాయని, త్వరలో చిత్రీకరణ ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నానని ఆయన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఇక, రాజమౌళి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా కోసం మహేష్ బాబు కండలు పెంచుతున్నారని సమాచారం అందుతోంది. మహేష్ రాజమౌళి కాంబో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల క్రితం నుంచి మహేష్ రాజమౌళి మూవీ గురించి ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తోంది.

మహేష్ తన సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా తగిన టైమ్ కేటాయిస్తారు. ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితార ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం సర్వసాధారణం అయితే, ఆయన కుమారుడు గౌతమ్ సాధారణంగా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక మహేష్ తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు, ఇంటర్వ్యూలలో తన పని గురించి మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. తన స్టార్ ఇమేజ్ తో పాటు ప్రైవసిని కాపాడుకోవడం చాలా కష్టమని మహేష్ పేర్కొన్నారు.