ట్విట్టర్లో నో ప్రమోషన్స్​..  బ్లూటిక్ పోగొట్టుకున్న యాక్టర్స్​!

Chennai: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) దర్శక నిర్మాణంలో రూపొందిన చరిత్రాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’(Ponniyin Selvan). చోళుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు వస్తుందని ముందే ప్రకటించారు మేకర్స్​. మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో విక్రమ్ (Vikram), ఐశ్వర్య బచ్చన్ (Aishwarya Rai Bachchan), జయం రవి (Jayam Ravi), కార్తీ (Karthi), త్రిష (Trisha), ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ వంటి పాపులర్​ నటులు భాగమవడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ మూవీ రెండో భాగం PS2 ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్​ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే పలు ప్రెస్ మీట్ లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు నటీనటులు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే జయం రవి, త్రిష తమ ట్విట్టర్ అకౌంట్స్ లో తమ పేర్లను మార్చారు. పొన్నియిన్ సినిమాలోని తమ పాత్రల పేర్లు అరుణ్మోళి వర్మన్‌, కుందవై ని తమ ట్విట్టర్ అకౌంట్ కి పెట్టుకున్నారు. అయితే ఆ తరువాత నుంచి ట్విట్టర్ లోని తమ బ్లూ టిక్‌ను కోల్పాయారు. దీంతో త్రిష కుందవై పేరుని తొలిగించి మళ్ళీ తన పేరునే పెట్టుకుంది. కానీ బ్లూ టిక్ మాత్రం తిరిగి రాలేదు. జయం రవి మాత్రం అరుణ్మోళి పేరునే కొనసాగిస్తున్నారు. అంటే ఇకనుంచి పేర్లు మార్చినా, సినిమా ప్రమోషన్స్​ కోసం సినిమా పేర్లు, పాత్రలు పేర్లు పెట్టినా ట్విటర్​లో బ్లూటిక్స్​ కోల్పోతారన్నమాట.