Adipurush: విమర్శలపై స్పందించిన నిర్మాత!

Mumbai: రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్ (Adipurush). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతిసనన్‌ (Kriti Sanon) సీతగా నటించిన ఈ సినిమా రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) రావణాసురుడిగా సన్నీ సింగ్ (Sunny Singh) ఆంజనేయుడి పాత్రలు పోషించారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్‌ (Om Raut) దర్శకత్వం వహించిన ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆదిపురుష్‌ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా దారుణంగా ట్రోల్ చేశారు. శ్రీ రాముడిపై రాసిన పాటను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ఆ పాటకు మాత్రం శ్రోతల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆదిపురుష్ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా నిర్మాతలు ఇన్నాళ్లూ మాత్రం స్పందించలేదు. తాజాగా దానిపై నిర్మాత భూషణ్ కుమార్ స్పందించారు.

‘ఆదిపురుష్ సినిమాను ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల చేయాలని అనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేశాం. సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. దేశంలో ఇటువంటి సినిమా ఇప్పటివరకు రాలేదు. మార్వెల్, డీసీ, అవతార్ వంటి సినిమాలకు వాడే హాలీవుడ్ టెక్నాలజీని ఆదిపురుష్ సినిమాకు ఉపయోగించాం. విమర్శలు వచ్చినప్పుడు నిరాశకు గురయ్యాం. ప్రస్తుతం వస్తున్న అవుట్‌పుట్‌తో సంతృప్తిగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు భూషణ్ కుమార్.