Ashish Vidyarthi: రాజీప‌డాల‌నుకోలేదు..!

Hyderabad: 60 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లి చేసుకున్న ప్ర‌ముఖ న‌టుడు ఆశిష్ విద్యార్ధి (ashish vidyarthi) మొత్తానికి త‌న పెళ్లిపై స్పందించారు. ఇదే నా జీవితం అంటూ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేసారు. “22 ఏళ్ల క్రితం రాజోషీ అలియాస్ పిలూని క‌లిసాను. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. మాకు అర్థ్ పుట్టాడు. ఇప్పుడు వాడు ఉద్యోగం చేస్తున్నాడు. ఇన్నేళ్ల త‌ర్వాత మా జీవితాల్లో కొన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. కూర్చుని ప‌రిష్క‌రించుకోవాల‌నుకున్నాం. కానీ ఆ ప‌రిష్కారం ఎవ‌రో ఒక‌రు రాజీప‌డ‌టం. అలా అయితే జీవితంలో సంతోషంగా ఉండ‌లేం. సంతోషం లేన‌ప్పుడు ఇంకెందుకు. అందుకే రాజీప‌డాల‌నుకోలేదు. ఇప్పుడు ఎవ‌రి జీవితాలు వారివి. అందుకే 2022లో విడాకులు తీసుకున్నాం” అని తెలిపారు.

మ‌రోప‌క్క మొదటి భార్య రాజోషీ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు. “ఆశిష్ న‌న్ను మోసం చేయ‌లేదు. ఆశిష్ కేవ‌లం రెండో పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు అని అనుకుంటున్న‌వారికి ఓ విష‌యం చెప్పాల‌నుకుంటున్నాను. అది నిజం కాదు. 2022లోనే మేం విడాకుల‌కు అప్లై చేసుకున్నాం. ఎవ‌రూ మ‌మ్మ‌ల్ని బ‌ల‌వంతం చేయ‌లేదు. ఇద్ద‌రం ప‌ర‌స్ప‌రంగానే చ‌ర్చించుకుని విడిపోవాల‌నుకున్నాం. ఇన్నేళ్లు అల‌నాటి న‌టి శకుంత‌ల కూతురిగా ఆశిష్ విద్యార్ధి భార్య‌గా జీవితాన్ని గ‌డిపాను. ఇప్పుడు ఒంట‌రిగా నా జీవితాన్ని నేను అనుభ‌వించాల‌నుకుంటున్నాను. నాకంటూ గుర్తింపు ఉండాలి అనుకున్నాను. నా గుర్తింపును పాడుచేయాల‌ని ఆశిష్ ఎప్పుడూ ప్ర‌య‌త్నించ‌లేదు. ఆయ‌న‌కు భవిష్య‌త్తుపై ఉన్న ఆలోచ‌నా విధానానికి నా ఆలోచ‌న తీరుకు భిన్నంగా ఉంది. అందుకే విడిపోవాల‌నుకున్నాం” అని తెలిపారు.