మరో భారీ బడ్జెట్​ సినిమాకు అఖిల్​ గ్రీన్​ సిగ్నల్​!

Hyderabad: టాలీవుడ్ (Tollywood)లోకి వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అనుకున్నంత కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాడు అక్కినేని అఖిల్ (Akhil Akkineni). మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, ఆ సినిమా కమర్షియల్‌గా మాత్రం హిట్ కాలేదు. దాంతో రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని ఏజెంట్‌ (Agent)తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

పాత కథలనే మరోసారి చూపించాడనే విమర్శలను తెచ్చుకున్నాడు దర్శకుడు సురేందర్‌‌ రెడ్డి (Surendar Reddy). ఆయన స్టైల్‌, మేకింగ్‌, విజన్‌ ఏజెంట్‌ సినిమాలో ఒక్క సీన్‌లో కూడా కనిపించలేదు. ప్రేక్షకులనే కాకుండా అక్కినేని అభిమానులను కూడా ఏజెంట్ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఏజెంట్ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కోసం రూ.40 కోట్లు సాధించాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.10 కోట్ల షేర్ కూడా సాధించలేదని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్లల్లో నష్టాలు తెచ్చిపెట్టింది.
ఈసారి ఎలాగైనా కమర్షియల్‌ హిట్ అందుకోవాలని అనుకున్న అఖిల్‌ కల.. కలగానే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే అఖిల్‌ తన కొత్త ప్రాజెక్ట్‌ ను స్టార్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో సినిమా చేయనున్నాడు ఈ యంగ్ హీరో.

ఇప్పటికే స్క్రిప్ట్‌ కూడా ఫైనల్‌ అయిపోయింది. సాహో సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్‌ను ప్రారంభించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనున్నట్లు సమాచారం.