Adipurush: ప్రమోషన్స్​ మిస్సవనున్న విలన్​!

Hyderabad: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్(Prabhas) చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి ఆదిపురుష్(Adipurush). రామాయణ (Ramayanam) ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో సీతగా కృతి సనన్ కనిపించనున్నారు. రావణాసురుడిగా సైఫ్‌ అలీ ఖాన్(Saif Alikhan), హనుమంతుడిగా సన్నీ సింగ్ నటించారు. ఈ సినిమాను జూన్ 16వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే, త్వరలోనే ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ప్రమోషన్స్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వచ్చే నెల నుంచి ఆదిపురుష్ ప్రమోషన్స్‌ మొదలుపెట్టనున్నారట. ‘ఆదిపురుష్‌’కు సంబంధించిన ఆసక్తికర విషయాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రభాస్‌ ప్రమోషన్స్‌ లో పాల్గొంటారని తెలుస్తోంది. మే నెలలో పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ప్రభాస్‌ డేట్స్‌ ఖాయం చేశారని అంటున్నారు.
అయితే ‘ఆదిపురుష్‌’లో కీలక పాత్ర పోషించిన సైఫ్‌ అలీ ఖాన్‌ మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్‌ కు దూరం కానున్నారని తెలుస్తోంది. దీనికి కారణం వచ్చే నెలలో ఆయన కుటుంబంతో పాటు సమ్మర్‌ వెకేషన్‌కు వెళ్లనుండటమేనని సమాచారం. అందుకే సినిమా ప్రచారంలో భాగం కావడంలేదని టాక్. అయితే ఈ ప్రమోషన్స్‌ విషయంపై సైఫ్‌ కానీ ‘ఆదిపురుష్‌’ చిత్రబృందం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇక ‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌కు సంబంధించిన ఓ వార్త కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ వచ్చే నెల 4వ తేదీ విడుదల చేయాలని ప్లాన్‌ చేశారట మేకర్స్. మూడు నిమిషాల ట్రైలర్‌ అంచనాలకు మించి ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది. ఇక, ప్రభాస్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. కాగా, ఇప్పటికే విడుదలైన ఆదిపురుష్ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.