Raj-Koti: రాజ్​ మరణంపై కోటి భావోద్వేగం!

Hyderabad: రాజ్- కోటి ద్వయంలో ఒకరైన​ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజ్(Raj) గుండెపోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. 90వ ద‌శ‌కంలో టాలీవుడ్‌లో రాజ్–కోటి(Raj-Koti) ద్వ‌యం పేరు మారుమ్రోగిపోయింది. వీరిద్ద‌రు క‌లిసి దాదాపు 180 సినిమాల‌కు సంగీతం అందించారు. వీరు సంగీతం అందించిన పాటలు ఇప్ప‌టికీ శ్రోతలను అలరిస్తున్నాయి. ఇక తన ప్రాణ స్నేహితుడు రాజ్​ మరణ విషయం తెలుసుకున్న కోటి(Koti) భావోద్వేగానికి గురయ్యారు.

‘నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను. కాసేపటి క్రితమే ఈ వార్త విన్నాను. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతోన్నాను. ఇటీవ‌లే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. రాజ్ కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ లేడంటే ఎంతో బాధగా ఉంది. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాను. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాడు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్‌ ఎప్పటికీ బతికే ఉంటాడు. చివరిసారిగా బేబీ సినిమా సాంగ్ లాంచ్ లోనే కలిశాం. అప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు, బాగానే మాట్లాడుకున్నాం’ అంటూ రాజ్​తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.