Jagan: వారికి జెలుసిల్ వేసినా క‌డుపుమంట త‌గ్గ‌దు..!

Vijayawada: వాలంటీర్ వ్యవస్థ మీద డజను జెలుసిల్ మాత్రలు వేసినా తగ్గనంత కడుపు మంట ప్రత్యర్థులకు ఉందని సీఎం జగన్(jagan) ఎద్దేవా చేశారు.  ఏపీలో ప్రజలకు ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులుగా వాలంటీర్లను చెప్పడానికి గర్వపడుతున్నట్లు జగన్ తెలిపారు. విజయవాడలో వాలంటీర్లకు వందనం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ప్రతి అవ్వా తాతలకు మంచి మనుమరాలు, మనుమడిగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. 64లక్షల మంది లబ్దిదారులకు ప్రభుత్వ పెన్షన్లను అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులని వాలంటీర్లను కొనియాడారు. 2019నుంచి 2.66లక్షల మంది మహా సైన్యం వ్యవస్థ ప్రజలకు సేవలు అందిస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్ల ద్వారా ప్రజలకు మంచిని అందించే కార్యక్రమం వాలంటీర్ల నిర్వహిస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వంపై పనిగట్టుకుని సోషల్ మీడియాలో ఎలా దుష్ప్రచారం చేస్తున్నారో అంతా చూస్తున్నారని, మంచి చేస్తున్న పేదల ప్రభుత్వం మీద గిట్టని వారి తప్పుడు ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారని, నిజాలను ప్రజలకు వివరించే సత్య సారథులు, సత్య సాయుథులు వాలంటీర్లు మాత్రమేనన్నారు. తనకు పత్రికలు, టీవీలు అండగా లేకపోయినా, ప్రతి ఇంటికి నేరుగా వెళ్లగలిగే వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రతి గడప వద్దకు తీసుకెళ్లగలిగినందున, ప్రతి ఇంట్లో మంచి జరిగిందో లేదో ధైర్యంగా అడిగే హక్కు వాలంటీర్లతోనే సాధ్యమైందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ప్రతి గడపలో మంచి తప్ప చెడు ఎక్కడా చేయలేదన్నారు.

లంచం తీసుకోవాలనే ఆలోచన రాకుండా గుర్తింపునివ్వడానికి ప్రతి ఏటా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జ‌గ‌న్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారని, వాలంటీర్లు అల్లరి మూకలని, అది మూటలు మూసే ఉద్యోగమని, అధికారం వస్తే వాలంటీర్లను రద్దు చేసి జన్మభూమి కమిటీలు పెడతామన్నారని గుర్తు చేశారు.