బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హ‌త్య‌

కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. సిటీలోని మురుగేష్పల్యలో ఒక యువతిని యువకుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌ కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన నిందితుడిని బాణాల దినకర్‌(28)గా గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఎస్సీ చదివిన పవిత్ర హెల్త్‌ కేర్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌ అనే కంపెనీలో పనిచేస్తోంది. ప్రతిరోజూ వలె మంగళవారం కూడా రాత్రి 7:30 గంటలకు ఆఫీసు నుంచి బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న దినకర్‌‌.. పవిత్రపై కత్తితో దాడి చేసి సుమారు 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో పవిత్ర అక్కడికక్కడే మరణించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం పట్టణానికి చెందిన దినకర్.. తోమలూరులోని హాస్టల్లో ఉంటున్నాడు. పవిత్ర, దినకర్ ఇద్దరూ 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పవిత్ర కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో దినకర్‌‌ను పవిత్ర దూరంగా ఉంచుతోంది. ఈ క్రమంలో దినకర్ ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో పవిత్రపై కక్ష పెంచుకున్న దినకర్ పక్కా ప్లాన్‌తో పవిత్ర పనిచేస్తున్న ఆఫీసు వద్దకు వచ్చి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.