Priyamani: చిరంజీవితో కలిసి నటించాలని ఉంది!

Hyderabad: తన అందం, అభినయంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న దక్షిణాది హీరోయిన్​ ప్రియమణి(Priyamani) . కెరీర్​ తొలినాళ్లలోనే స్టార్​ హీరోలు, స్టార్​ డైరెక్టర్లతో కలిసి పని చేసిన ఈ భామ సెకండ్​ ఇన్నింగ్స్​లోనూ భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్​ఫుల్​గా సాగుతోంది. తాజాగా నాగ చైతన్య (Naga chaitanya) నటించిన కస్టడీ (Custody) సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనుంది. కోలీవుడ్​ డైరెక్టర్​ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం మే 12న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ సినిమాలో ప్రియమణి ముఖ్యమంత్రిగా అలరించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి పలు ఆసక్తికర విషయాలు చెప్పకొచ్చింది.

‘వెంకట ప్రభులాంటి టాలెంటెడ్​ దర్శకుడు రూపొందించిన ‘కస్టడీ’ లాంటి గొప్ప సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ప్రతి సన్నివేశాన్ని అర్థమయ్యేలా వివరంగా చెబుతారు. నాగ చైతన్య నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. కానీ ఈ సినిమాలో మొదటిసారి కలిసి పనిచేశాం. మా కాంబినేషన్‌ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వెంకట్​ గారు ఈ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది, వెంటనే ఓకే చెప్పేశా. దాదాపుగా టాలీవుడ్​లోని స్టార్​ హీరోలందరితో నేను వర్క్‌ చేశాను. బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున అందరి సినిమాల్లోనూ నటించాను. కానీ చిరంజీవి గారితో (Chiranjeevi) మాత్రం ఒక్క సినిమా కూడా చేసే అవకాశం రాలేదు. చిన్న పాత్రలో అయినా ఆయనతో కలిసి నటించాలని ఉంది. షారుఖ్​ ఖాన్​ అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.

ఇక కస్టడీ సినిమా రిలీజ్​ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్​ జోరు పెంచింది చిత్రబృందం. ఇటీవలే ప్రీ రిలీజ్​ ఈవెంట్​ని కూడా గ్రాండ్​గా నిర్వహించారు. ఈ సందర్భంగా రిలీజ్​ చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Kriti Shetty) హీరోయిన్​గా నటించింది.​