శరత్​ బాబుకి కమల్​ హాసన్​ నివాళి.. మండిపడుతున్న నెటిజన్లు!

Hyderabad: టాలీవుడ్​ సీనియర్​ నటుడు శరత్​ బాబు(Sarath Babu) కొన్నాళ్లుగా గచ్చిబౌలి(Gachibowli)లోని ఏఐజీ(AIG) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఆసుపత్రిలో చేరింది మొదలు ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి. కొందరు ఏకంగా ఆయన చనిపోయారని రాసేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు అవన్నీ రూమర్లే అని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కాగా యూనివర్సల్​స్టార్​ కమల్​ హాసన్(Kamal Haasan)​ కూడా ఈ వదంతులను నమ్మి శరత్​ బాబుకు నివాళి అర్పిస్తూ ట్వీట్​ చేశారు. దీంతో కమల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శరత్ బాబుతో అంత ఆత్మీయత ఉంటే ట్వీట్ వేసే ముందు కనీసం ఆయన పరిస్థితి ఏమిటో తెలిసుకోవాలని కదా అని నెటిజన్లు తిడుతున్నారు. తెలుగు నటులంటే తమిళం వాళ్లకు ఎంత నిర్లక్ష్యమో ఈ ట్వీట్ చెబుతుందంటున్నారు. దీంతో కమల్ కాసేపటి తర్వాత ట్వీట్ డిలీట్ చేశారు. అప్పటికే అది వైరల్ అయింది.

మరోపక్క శరత్ బాబుపై మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కేసు పెడతామని ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ హెచ్చరించారు. శరత్ చనిపోయినట్లు వస్తున్న వార్తలతో తమ కుటుంబం క్షోభకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా పెదనాన్న చనిపోయినట్లు పెట్టిన వీడియోలను తీసేయకపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాక. ఆయన ఆరోగ్యం గురించి చెప్పడానికి మేం ఉన్నాం. ఆయన కోలుకుని అన్ని వివరాలు చెబుతారు, అంతవరకు ఓపిక పట్టండి. బతికి ఉన్న వాళ్లను చంపకండి’ అని అన్నారు. శరత్ బాబు ఇటీవల తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. కీలక అవయవాలు దెబ్బతిన్నాయని వార్తలు వచ్చినా, ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.