hyderabad: దారుణం.. మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి

hyderabad: భాగ్యనగరంలో ఇవాళ ఉదయం కుండపోతగా వర్షం కురిసింది. దీంతో పలు వీధులన్నీ జలమయం అయ్యాయి. ఈనేపథ్యంలో ఉదయం వేళ పాల ప్యాకెట్టు తీసుకొచ్చేందుకు మౌనిక(mounika) అనే బాలిక తన తమ్ముడితో కలిసి బయటకు వచ్చింది. ఈక్రమంలో బాలిక సోదరుడు ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. అతన్ని రక్షించే క్రమంలో బాలిక మ్యాన్‌హోల్‌లో జారి పడిందని(girl falling into open manhole) ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ(ghmc)  సిబ్బంది మ్యాన్‌హోల్‌పై మూత తీసేయడంతో.. ప్రమాదవశాత్తు బాలిక అందులో పడిపోయింది. చివరికి ఊపిరి ఆడక.. కన్నుమూసింది. చిన్నారి మృతికి జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మౌనిక కళాసిగూడలో పాల ప్యాకెట్‌ కోసం వచ్చి మ్యాన్‌హోల్‌లో పడిపోగా.. పార్క్‌లైన్‌ దగ్గర పాప మృతదేహాన్ని జీహెచ్‌ఎంసీ సిబ్బంది గుర్తించారు. మృతురాలు 4వ తరగతి చదువుతుందని సమాచారం. చిన్నారి మృతదేహం గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు, రేపు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ రోజు దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. రేపు ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.