Unni Mukundan: మోదీని కలవాలనే కల నెరవేరింది!

Hyderabad: ఎన్టీఆర్(NTR)​ నటించిన జనతా గ్యారేజ్(Janatha Garage)​ సినిమా ద్వారా టాలీవుడ్(Tollywood)​కి పరిచయమైన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్(Unni Mukundan). ఆ తరువాత భాగమతి, ఖిలాడీ, యశోద వంటి సినిమాతోనూ ప్రేక్షకులను అలరించాడు. తాజాగా మలయాళ సూపర్ హిట్ సినిమా మాలికాపురం (Malikappuram) తో టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించాడు. కాగా ఈ హీరో ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి దాదాపు 45 నిముషాలు పాటు మాట్లాడాడు. ఈ విషయాన్ని స్వయంగా ముకుందన్​ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ముకుందన్ మలయాళ నటుడు అయినప్పటికీ అతని బాల్యం అంతా గుజరాత్ అహ్మదాబాద్ లోనే సాగింది. దీంతో గుజరాతీ అయిన మోదీని ముకుందన్ చిన్ననాటి నుంచి అభిమానిస్తూ ఉన్నాడు.

అయితే జీవితంలో ఒక్కసారైనా మోదీని కలిసి గుజరాతీ భాషలో మాట్లాడాలని తన 14 వ ఏట నుంచీ  కలగనే వాడట ముకుందన్. ఇటీవల కేరళ పర్యటనకు వచ్చిన మోదీని ముకుందన్ పర్సనల్​గా కలిశాడు. ఇక మోదీతో మాట్లాడిన ఆనందాన్ని పంచుకుంటూ తన ఇరవై ఏళ్ల కల నెరవేరిందంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్​గా పోస్ట్ పెట్టాడు.

‘నా అకౌంట్ లో ఇదే చాలా పవర్ ఫుల్ పోస్ట్. 14 ఏళ్ళ వయసు నుంచి మిమ్మల్ని కలవాలనే కోరిక ఇవాళ నిజమైంది. మీరు నన్ను గుజరాతీ భాషలో పలకరించడం నన్ను షాక్ కి గురి చేసింది. మిమ్మల్ని కలిసి మీతో గుజరాతులో మాట్లాడాలనేది నా జీవితంలోని పెద్ద కల. అది ఇవాళ నెరవేరింది. మీతో మాట్లాడిన ఈ 45 నిముషాలు నా జీవితంలోనే మర్చిపోలేనివి. మీరు చెప్పిన ప్రతి మాట, సలహా ఆచరణలో పెట్టడంతోపాటు అమలు చేస్తాను’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే మోదీతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశాడు.