తండ్రి చితి అంటించ‌డానికి 2.5 ల‌క్ష‌లు అడిగిన కొడుకు

son demands 2 lakhs to lit father pyre

Viral News: తండ్రి చ‌నిపోయాడు అని ఓ త‌ల్లి దూరంగా ఉంటున్న కొడుక్కి స‌మాచారం అందిస్తే.. డ‌బ్బులిస్తే కానీ రాను అని దారుణంగా ప్ర‌వ‌ర్తించిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. షాహ్దోల్ ప్రాంతానికి చెందిన రామ్ స్వ‌రూప్ బ‌ర్మ‌న్ అనే వ్య‌క్తి అనారోగ్యంతో చ‌నిపోయాడు. ఈ నేప‌థ్యంలో అత‌ని భార్య పార్వ‌తి దూరంగా ఉంటున్న త‌న కొడుకు మ‌నోజ్‌కు ఫోన్ చేసి విష‌యం చెప్పింది.

కొడుకుగా త‌ల కొరివి పెట్టేందుకు రావాల్సిందిగా కోర‌గా.. రూ.2.5 ల‌క్ష‌లు ఇస్తే వ‌స్తా అని చెప్పాడు. అది విని పార్వ‌తి షాకైంది. అంత డ‌బ్బు లేదు బాబూ.. నాన్నకి కొరివి పెట్టాల్సింది నువ్వే క‌దా అని పార్వ‌తి ఏడుస్తూ బతిమిలాడితే.. అయితే ఇల్లు అమ్మేసి డ‌బ్బు ఇవ్వు అప్పుడు వ‌స్తా అన్నాడు. దాంతో ఆమె ఫోన్ పెట్టేసింది. చేసేదేమీ లేక గ్రామ‌స్తుల సాయంతో త‌న భ‌ర్త శ‌వాన్ని తానే మోసి అత‌ని చితికి నిప్పు పెట్టింది. క‌నీసం పదో రోజైనా రావాలని మ‌నోజ్‌ను కోర‌గా అప్పుడు కూడా అత‌ను రాలేదు.

దాంతో ఆ త‌ల్లి మ‌న‌సు గాయ‌ప‌డింది. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. క‌న్న త‌ల్లిదండ్రుల‌ను చూసుకోకుండా రోజూ గొడ‌వ ప‌డేవాడ‌ని.. ఇప్పుడు త‌మ‌ను వ‌దిలేసి దూరంగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడ‌ని.. తండ్రి చ‌నిపోతే కూడా రాని ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలంటూ ఫిర్యాదు చేసింది. అయితే ఇలాంటి విష‌యాల్లో తాము క‌ల‌గ‌జేసుకోము అని పోలీసులు చెప్ప‌డంతో ఆమె ఏడుస్తూ వెళ్లిపోయింది.