నాడు ప‌వ‌న్ చేస్తే త‌ప్పు కాదు.. మ‌రి అల్లు అర్జున్‌ది ఎందుకు త‌ప్పు?

how was it right for pawan kalyan and not for allu arjun

Allu Arjun: అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని చాలా మంది చెవులు కొరుక్కుంటున్నారు. కానీ తామంతా క‌లిసే ఉంటామ‌ని ఆ కుటుంబం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రోక్షంగా క్లారిటీ ఇస్తూనే వ‌చ్చేది. కానీ ఇక క్లారిటీలు ఇచ్చుకోవ‌డాల్లేవ్.. నేరుగా స‌మాధానాలు చెప్ప‌డాలే.. అని నిన్న అల్లు అర్జున్ చేసిన కామెంట్‌తో తెలిసిపోయింది. మారుతి న‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేప‌థ్యంలో అల్లు అర్జున్, సుకుమార్ హాజ‌రయ్యారు. సుకుమార్ భార్య త‌బిత ఈ సినిమాను సమ‌ర్పించారు.

అయితే నిన్న ఈవెంట్‌లో అల్లు అర్జున్ కొంత‌కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య ఉన్న విభేదానికి ఫుల్ స్టాప్ పెట్టిన‌ట్లైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో అల్లు అర్జున్ జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌కుండా త‌న స్నేహితుడైన వైఎస్సార్ కాంగ్రెస్ నేత శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డికి స‌పోర్ట్ చేయ‌డం మెగా ఇంట అగ్గి రాజేసింది. దాంతో నాగ‌బాబు ప‌రాయివాడు మ‌న‌వాడు అంటూ ట్వీట్ పెట్టారు. ఆ త‌ర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ రావ‌డంతో ఆ ట్వీట్ డిలీట్ చేసారు.

అయితే.. త‌న‌కు న‌చ్చితే ఏ కార్య‌క్ర‌మానికైనా వెళ్తాను ఎవ‌రికైనా స‌పోర్ట్ చేస్తాన‌ని అల్లు అర్జున్ నిన్న తేల్చి చెప్పేసారు. నాకు న‌చ్చిన‌వారి కోసం నేను నిల‌బ‌డ‌తాను. నాకు న‌చ్చితే త‌ప్ప‌కుండా నా వంతు నేను స‌పోర్ట్ చేస్తాను. ఆ విష‌యం మీకు ఎటూ తెలిసిందే అని ఒక్క మాట‌లో కొంత‌కాలంగా త‌నపై వ‌స్తున్న నెగిటివిటీకి చెక్ పెట్టారు. అయితే ఇప్ప‌టికీ మెగా కుటుంబానికి అల్లు అర్జున్‌పై ఆ కోపం అలాగే ఉంది. అందుకే సాయి ధ‌ర‌మ్ తేజ్ అల్లు అర్జున్‌ని సోష‌ల్ మీడియాలో అన్‌ఫాలో చేసారు.

నాడు ప‌వ‌న్ చేసింది త‌ప్పు కాదా?

అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఒక డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఒక‌ప్పుడు చిరంజీవి త‌న ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించారు. మ‌రి అన్న‌య్య కాంగ్రెస్‌లో ఉంటే ఆ పార్టీకి వ్య‌తిరేకంగా త‌మ్ముడు మ‌రో పార్టీ పెట్టడం త‌ప్పుకాదా?

బ‌న్నీ సినిమాకు వెళ్ల‌ని చిరంజీవి

కుటుంబం కోసం ఒక‌రికొక‌రు నిల‌బ‌డాల‌ని.. అలాకాకుండా బ‌య‌టి వ్య‌క్తుల‌కు ఎలా మ‌ద్ద‌తు ఇస్తార‌నేదే ఇప్పుడు టాపిక్. మ‌రి మ‌హేష్ బాబు న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు.. అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పురంలో సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయ‌ని తెలిసి.. చిరంజీవి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు. మ‌రి మేన‌ల్లుడైన బన్నీ సినిమా ఈవెంట్‌కి వెళ్ల‌కుండా చిరంజీవి వేరే సినిమాకు అతిథిగా వెళ్లి ప్ర‌మోట్ చేయ‌డం స‌బ‌బేనా?

ఇలా కుటుంబంలో ఎవ‌రికి న‌చ్చిన‌వి వాళ్లు చేసుకుంటూ పోతున్నారు. అలాంట‌ప్పుడు బ‌న్నీకి మాత్రమే ఒక గిరి గీసి ఇదే చెయ్యాలి అనడం ఎంతవరకు సమంజసం? అనే చ‌ర్చ నెట్టింట జ‌రుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?