Paris Olympics: ఒలింపిక్ బంగారు ప‌త‌కం ఖ‌రీదు ఎంతో తెలుసా?

how much an olympic gold medal costs

Paris Olympics: ప్ర‌పంచ క్రీడా రంగంలో అత్యున్న‌త స్థానం ఒలింపిక్స్‌కి ఉంది. ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధించారంటే ఇక ఆ క్రీడాకారుడికి తిరుగే ఉండ‌దు. ఆ బంగారు ప‌త‌కం సాధించేందుకు క్రీడాకారులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. మ‌రి అంత ప్రాముఖ్య‌త ఉన్న ఒలింపిక్ బంగారు ప‌త‌కం విలువ ఎంతో తెలుసా? 950 డాల‌ర్లు. అంటే మ‌న భార‌తీయ క‌రెన్సీలో రూ.79753. అయితే ప్ర‌తి ఒలింపిక్స్ క్రీడ‌ల స‌మయంలో బంగారు ప‌త‌కానికి ఒక్కో ధ‌ర నిర్ణ‌యిస్తారు. ఈ 950 డాల‌ర్ల ధ‌ర 2024 పారిస్ ఒలింపిక్స్ బంగారు ప‌త‌కానికి సంబంధించినది.

కాక‌పోతే ఈ బంగారు ప‌త‌కంలో మొత్తం బంగారే ఉండ‌దు. 500 గ్రాముల వెండి.. 6 గ్రాముల బంగారం వాడ‌తారు. ఫ్రాన్స్‌కి చెందిన ప్ర‌ముఖ వాచీ, జువెల‌రీ సంస్థ షామే దీనిని త‌యారుచేసింది. ప్యూర్ గోల్డ్ ప‌త‌కాల‌ను 1912 వ‌ర‌కు ఇచ్చేవారు. అప్ప‌టి బంగారు ప‌త‌కాల‌ను ఇప్పుడు ఇచ్చి ఉంటే వీటి ధ‌ర మ‌న క‌రెన్సీలో రూ.34,55,782 ఉంటుంది.

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ఒలింపిక్ బంగారు ప‌త‌కంలో క‌చ్చితంగా 500 గ్రాముల వెండి వాడి తీరాల‌ని నియ‌మాన్ని విధించారు. అంటే ప‌త‌కంలో 95.4% ఉండేవి వెండే. మిగ‌తాదంతా బంగారం. ఇక ఈ ప‌త‌కాల్లో వాడే ఐర‌న్ ఈఫిల్ ట‌వ‌ర్ నుంచి సేక‌రిస్తార‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న బంగారం, వెండి, ఐర‌న్ ధ‌ర‌ల‌ను బట్టి చూస్తే ఒలింపిక్ బంగారు ప‌త‌కం ధ‌ర 1,027 డాల‌ర్ల వ‌ర‌కు ఉంటుంది. ఇక సిల్వ‌ర్ ప‌త‌కం ఖ‌రీదు 535 డాల‌ర్లు కాగా.. కాంస్యం 12 డాల‌ర్లు ఉంటుంది.