NTR బర్త్​డేకి ఫ్యాన్స్​కి అదిరిపోయే ట్రీట్​!

యంగ్​ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం NTR30 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సరికొత్త కథతో ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి రెడీ అయ్యాడు దర్శకుడు కొరటాల శివ. కళ్యాణ్ రామ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్‌‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ వంటి గ్లోబల్ హిట్ తరువాత వస్తున్న మూవీ కావడంతో NTR30 చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కంటే ముందు మరో ఇండస్ట్రీ హిట్ మూవీని ఎన్టీఆర్ అభిమానుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్.
2003 లో రాజమౌళి, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకుముందు స్టూడెంట్ నంబర్1 అనే సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా వచ్చిన సింహాద్రి మాస్ ఆడియన్స్‌ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు కూడా ఆ సినిమాతో ఎన్టీఆర్ గట్టి పోటీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఏకంగా ఇండస్ట్రీ హిట్‌తో సంచలనం సృష్టించింది సింహాద్రి సినిమా. భూమిక, అనిత హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.
ఇక ఈ సినిమాలో చంద్రబోస్ రాసిన ‘నువ్వు విజిలేస్తే’ సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. తెలుగులో సూపర్‌‌హిట్ అయిన సింహాద్రి సినిమాను తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ చేశారు. కాగా, ఈ సినిమాకి ఎన్టీఆర్ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. తాజాగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు మేకర్స్. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమాను 4K క్వాలిటీతో రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. విమానాలతో ఆకాశంలో ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.