NTR 30: తార‌క్ డ్యుయ‌ల్ రోల్.. కొరటాల ప్లాన్​ వర్కౌట్​ అవుతుందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా NTR 30 . జ‌న‌తా గ్యారేజ్​తో సూపర్​ హిట్​ కాంబినేష‌న్‌గా నిలిచిన వీరి కాంబోపై భారీ అంచ‌నాలున్నాయి. అంతేకాదు, తెలుగు సినిమా ప్రత్యేకతని ఆస్కార్​ వేదికపై చాటిన ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ న‌టిస్తోన్న సినిమా ఇదే కావడంతో మరింత ఆసక్తిగా ఉన్నారు అభిమానులు. పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మేక‌ర్స్‌. దాదాపు ఏడాది కాలంగా వేచిచూస్తున్న ఈ సినిమాను ఇటీవలే పూజాకార్యక్రమాలు పూర్తిచేసుకుని పట్టాలెక్కించారు. NTR 30 షూటింగ్​లో తారక్​ భాగమైన వీడియో కూడా బయటకు రావడంతో ఫుల్​ ఖుషీ అయ్యారు ఫ్యాన్స్​. అదీ తారక్​ స్వయంగా తన సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.
భారీ బడ్జెట్​తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్​ షెడ్యూల్​ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్లో ఫ‌స్ట్ షెడ్యూల్‌ను చిత్రీక‌రించారు. దాదాపు 18 రోజుల పాటు షూటింగ్‌ను పూర్తి చేసింది చిత్ర యూనిట్. కాగా, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త హల్​చల్​ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో తారక్​ ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నారట. అది కూడా తండ్రీ కొడుకులుగా. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి పాత్ర క‌నిపిస్తుంద‌ని టాక్‌. అయితే ఇదివరకు తారక్​ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఆంధ్రావాలా డిజాస్టర్​గా మిగిలింది. పూరీ జగన్నాథ్​​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తారక్​ని తండ్రిగా చూపించడమే పెద్దలోపం అన్నారు విశ్లేషకులు. తారక్​ కెరీర్​లోనే భారీ డిజాస్టర్​గా మిగిలిపోయిన సినిమాగా నిలిచింది. అయితే అదుర్స్​లోనూ తారక్​ ద్విపాత్రాభినయం చేయగా ఆ సినిమా సూపర్​ హిట్​ అయ్యింది. అయితే ఇందులో ట్విన్​ బ్రదర్స్​గా చేయడం వల్ల ప్రేక్షకులకు బాగా నచ్చింది. జై లవ కుశలో త్రిపాత్రాభినయంతోనూ కొంతవరకు ఆకట్టుకున్నారు తారక్​. కొరటాల ఈ సినిమాలో తారక్​ని ఎలా చూపిస్తాడో అని భయపడుతున్నారు ఫ్యాన్స్​.
‘ఫార్‌ అక్రాస్‌ కోస్టల్‌ ల్యాండ్స్ ఆఫ్‌ ఇండియా, ఫర్‌గాటెన్‌ ల్యాండ్స్‌లో తెర‌కెక్క‌బోయే క‌థ‌. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. ఆ మృగాళ్ల‌కు భయమంటే ఏంటో తెలియదు. దేవుడంటే..చావంటే భయం లేదు. కానీ వారంద‌రికీ ఉండే ఒకే ఒక భ‌యం ఉంటుంది. అదేంటో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న్క‌ర్లేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది’ అంటూ కొరటాల శివ ఓపెనింగ్ రోజున ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో సినిమా ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉండబోతుంద‌నేది ఫిక్స్ అయ్యింది. సముద్ర‌తీరంలోని ప్ర‌జ‌లు ప‌డే ఇబ్బందులు, స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా సాగుతుంద‌ని టాక్‌. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ క‌పూర్ న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రికృష్ణ‌.కె. సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో హీరోయిన్​గా ధమాకా బ్యూటీ శ్రీలీలను తీసుకున్నట్లు టాక్​. ఏదేమైనా ఈ సినిమాను ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.