చిరుధాన్యాలు చేసే మేలు అంతా ఇంతా కాదు..!

చిరుధాన్యాల్లో పోషకాలు అపారం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వీటి ప్రయోజనాలు గురించి తెలియక చాలామంది చిరుధాన్యాలు పక్కన పెట్టేస్తారు. అందుకే చిరుధాన్యాల ప్రయోజనాల్ని తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాది మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. అంతేకాదు మిల్లెట్స్​ మీద స్టాంప్ కూడా విడుదల చేసింది. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, కొర్రలు వంటివాటిని చిరుధాన్యాలు అంటారు. నిజానికి ప్రాచీనకాలంలో వరి బియ్యం కంటే చిరుధాన్యాలు తినేందుకు మొగ్గు చూపేవాళ్లు. కానీ బియ్యం వాడకం పెరగడంతో వీటి వాడకం తగ్గిపోయింది. అయితే ఈమధ్య కాలంలో బియ్యంలోని కార్బోహైడ్రెట్స్​ వల్ల షుగర్​, ఒబేసిటీ వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతుండటంతో మళ్ళీ చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వేసవిలో చిరుధాన్యాలను తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఒంటికి వేడిచేసే ధాన్యాలు కాకుండా చలువ చేస్తూ త్వరగా జీర్ణమయ్యే రకాలను ఎంచుకోవాలి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో, ఎండాకాలంలో వీటిని ఎలా తినాలో తెలుసుకుందాం..

* ప్రతిరోజు మిల్లెట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మెనోపాజ్ తర్వాత గుండె జబ్బులతో పోరాడటానికి మహిళలకు ఇవి సహాయపడతాయి. శరీరంలో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రించవచ్చు. పిత్తాశయంలో రాళ్ళతో బాధపడే వాళ్ళు వాటిని పోగొట్టుకోవాలని అనుకుంటే మిల్లెట్స్ చక్కని ఆహారం. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇవి గ్లూటెన్ ఫ్రీ. చిరుధాన్యాలు తినడం వల్ల కొంతమందికి ఆరోగ్యకరమే కానీ మరికొంతమందికి తీవ్ర సమస్యలు తీసుకొస్తాయి. అందుకే మొదటి సారి మీరు మిల్లెట్స్ తీసుకోవాలని అనుకుంటే కొద్ది కొద్దిగా తినాలి. ఎసిడిటీ లేదా ఉబ్బరం వంటి సంకేతాలు కనిపిస్తే వాటిని తినకపోవడం మంచిది.
* మిల్లెట్స్ ఉడికించుకుని తినడం మంచిది. జీర్ణం చేయడం కూడా సులభంగా ఉంటుంది. జోవర్, బజ్రా ముందుగా కాకుండా కోడో వంటి ధాన్యాలతో ప్రారంభించడం ఉత్తమం.
* మిల్లెట్స్ అందరి శరీరానికి నప్పుతాయని అనుకుంటారు. కానీ అవి తింటే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మిల్లెట్స్ తిన్న తర్వాత మీకు కడుపులో ఎటువంటి అసౌకర్యం లేకపోతే వారు నిరభ్యంతరంగా తినవచ్చు. కిచిడీ, రోటీలాగా చేసుకుని తినడం ఉత్తమం. మిల్లెట్స్ ఏ టైమ్ లో తింటే మంచిదనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ తీసుకోవచ్చు. కానీ మితంగా మాత్రమే తీసుకోవడం ఉత్తమం. వారానికి మూడు లేదా నాలుగు సార్లు తినవచ్చు. హైపోథైరాయిడిజం ఉన్నవారికి మాత్రం ఇది వర్తించదు.
* థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు మిల్లెట్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది థైరాయిడ్ పెరుగుదలకు దారి తీస్తుంది. అయోడిన్ శోషణకు ఆటంకం కలిగించే గోయిట్రోజెన్ లు ఉంటాయి. ఇవి ఇబ్బంది కలిగిస్తాయి.
* మిల్లెట్స్ తినేటప్పుడు నీరు బాగా తాగాలి. బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. వాతావరణ మార్పుల ప్రకారం మిల్లెట్స్​ను ఎంచుకోవాలి
* కొన్ని మిల్లెట్లు వేసవిలో మంచివి, మరికొన్ని చలికాలంలో తింటే శరీరానికి వెచ్చదనం అందిస్తాయి. వేసవిలో జొన్నలు, రాగులు, ఫాక్స్‌టైల్ మిల్లెట్, బార్న్యార్డ్ మిల్లెట్, కోడో తినడం మంచిది. ఇవి మీకు వెచ్చని వాతావరణంలో చల్లదనం అందిస్తాయి.
* మన దేశంలో దాదాపు 8 రకాల మిల్లెట్స్ పండిస్తారు. రాగులు, ఫాక్స్‌టైల్ మిల్లెట్, బార్న్యార్డ్ మిల్లెట్, సజ్జలు చలికాలంలో తింటే మంచిది. లిటిల్ మిల్లెట్, ప్రోసో మిల్లెట్ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని వేసవి కాలంలో తినవచ్చు. రాగి జావ, అంబలి వంటివి ఎండాకాలంలోనూ చలువ చేస్తాయి.