YS Sunitha Reddy: నాకు ఏమైనా జ‌ర‌గ‌చ్చు.. అన్నింటికీ తెగించే వ‌చ్చా

ys sunitha slams jagan for telling lies about ys avinash reddy

YS Sunitha Reddy: నాకు ఏమైనా జ‌ర‌గ‌చ్చు.. అన్నింటికీ తెగించే వ‌చ్చా అని అన్నారు వైఎస్ సునితా రెడ్డి. త‌న తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఎలాగైనా కడ‌ప ఎంపీగా ఓడించి వైఎస్ ష‌ర్మిళ‌ను గెలిపించాల‌ని సునీత కృషి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. అస‌లు త‌ప్పే చేయ‌న‌టువంటి అవినాష్ రెడ్డిపై ఎందుకు ఆరోప‌ణ‌లు చేస్తున్నారో తెలీడంలేద‌ని.. ఈ కేసు ఇంకా కోర్టులో ఉన్నందున తాను ఏమీ మాట్లాడ‌లేన‌ని అన్నారు. దీనిపై సునీతా రెడ్డి స్పందించారు.

“” కేసు ఇంకా కోర్టులో ఉన్న‌ప్పుడు మీరు ముఖ్య‌మంత్రి అయ్యాక అసెంబ్లీలో అవినాష్ రెడ్డి చంప‌లేదు అని ఎలా చెప్ప‌గ‌లిగారు? మొన్న ప్ర‌చారంలో అవినాష్ అమాయ‌కుడు అని క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు? నేను ప‌గ తీర్చుకోవాల‌నుకుంటే నా తండ్రిని చంపిన‌వారిని నేనే న‌రికేదాన్ని. నాకు కావాల్సింది ప‌గ తీర‌డం కాదు. స‌మాజంలో లా అండ్ ఆర్డ‌ర్ బాగుప‌డాలి. ఇలా చంపేసి చట్టాన్ని కోర్టుల్ని గుప్పిట్లో పెట్టుకుని బ‌య‌ట తిరుగుతానంటే కుద‌ర‌దు. నా తండ్రికి న్యాయం జ‌ర‌గాల‌ని నేను తెగించి వ‌చ్చాను. నాకు నా భ‌ర్త‌కు నా కుటుంబానికి ఏమైనా జ‌ర‌గ‌చ్చు. అందుకే పోలీస్ ప్రొటెక్ష‌న్ తీసుకున్నాం. మేం ఎక్క‌డికి వెళ్లినా మాపై నిఘా ఉంటుంది. ష‌ర్మిళ‌ను క‌డ‌ప ఎంపీగా చూడాల‌నేది మా నాన్న చివ‌రి కోరిక‌. 2019 ఎన్నిక‌ల్లో అది సాధ్యం కాలేదు. అందుకే ఈసారి ఆయ‌న క‌ల‌ను నెర‌వేర్చాల‌ని అనుకుంటున్నాను“” అని తెలిపారు.