Kodi Kathi Srinu: ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడికత్తి శ్రీను..!

Kodi Kathi Srinu: ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌పై ఎయిర‌పోర్ట్‌లో కోడి క‌త్తితో దాడి చేసిన శ్రీను గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అప్ప‌టి నుంచి ఇత‌ని పేరు కోడిక‌త్తి శ్రీనుగా మారిపోయింది. గ‌త నాలుగేళ్లుగా ఈ కేసులో భాగంగా జైల్లో ఉన్న శ్రీను.. ఫిబ్ర‌వ‌రి 9న బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. అయితే ఇప్పుడు కోడి క‌త్తి శ్రీను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న జై భీం పార్టీలో చేరారు. విజ‌య‌వాడ‌లోని ఆ పార్టీ అధ్య‌క్షుడు జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్ అధ్యక్ష‌త పార్టీలో చేరాడు. కోడిక‌త్తి శ్రీను అమ‌లాపురం నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కోడిక‌త్తి శ్రీను అస‌లు పేరు జ‌నిప‌ల్లి శ్రీనివాస్. దాదాపు ఐదేళ్లుగా వైజాగ్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభ‌విస్తున్నాడు. పాపం.. అత‌నికి జ‌గ‌న్ అంటే అభిమానం అట‌. అత‌న్ని ముఖ్య‌మంత్రిగా చూడాల‌న్న‌దే ఆశ అని అందుకే కోడిక‌త్తితో ఎటాక్ చేస్తే సానుభూతి వ‌చ్చి జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతార‌న్న ఉద్దేశంతో ఇలా చేసాన‌ని పోలీసుల‌కు చెప్పాడు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత శ్రీను కుటుంబీకులు ఎన్నిసార్లు ప్ర‌భుత్వాన్ని వేడుకున్నా అత‌న్ని వ‌దిలిపెట్ట‌లేదు. ఇప్పుడు శ్రీను బెయిల్‌పై రిలీజ్ అయిన నేప‌థ్యంలో ఇత‌ను అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే ప‌దవితో పోటీ చేస్తాన‌ని ఆశ‌ప‌డుతున్నాడు. ఏ పార్టీ అయినా త‌నకు టికెట్ ఇస్తే ఎస్సీ వ‌ర్గాల కోసం ప‌నిచేయాల‌ని ఉంద‌ని చెప్తున్నాడు. ఇందుకోసం త‌న‌కు బెయిల్ వ‌చ్చేందుకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్కరి వ‌ద్ద‌కు వెళ్లి క‌లుస్తున్నాడ‌ట‌.