Jagan: చంద్ర‌బాబుకి ఓటంటే.. చంద్ర‌ముఖిని పిలిచిన‌ట్లే

Jagan: చంద్ర‌బాబు నాయుడులాగా (Chandrababu Naidu) పొత్తుల‌ను ఎత్తుల‌ను న‌మ్ముకోకుండా సింహంలా సింగిల్‌గా పోటీ చేస్తున్నానని అన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డి. సిద్ధం కార్య‌క్ర‌మంలో భాగంగా చివ‌రి స‌భ‌లో పాల్గొన్న జ‌గ‌న్.. చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. పొత్తులో భాగంగా త‌క్కువ సీట్లు వ‌స్తే ఎందుకు ఇంత త‌క్క‌వు సీట్లు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి (Pawan Kalyan) అడ‌గే ధైర్యం కూడా లేదని.. చంద్ర‌బాబు నాయుడు ప‌వ‌న్‌ను సైకిల్ ఎక్క‌మంటే ఎక్కుతాడు.. సైకిల్ తొయ్య‌మంటే తోస్తాడు అని విమ‌ర్శించారు.

14 ఏళ్ల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీని సంప్రదించి ఏపీకి ప్ర‌త్యేక హోదాను తీసుకురాలేక‌పోయిన వారు ఇప్పుడు మ‌ళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నార‌ని అన్నారు. చంద్ర‌బాబు నాయుడు రెండు పార్టీల‌తో పొత్తు పెట్టుకున్నాడంటే తాను ఆయ‌న గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించాన‌ని అర్థ‌మ‌ని అన్నారు. త‌న‌కు చంద్ర‌బాబు నాయుడు లాగా స్టార్ క్యాంపెయినర్లు లేర‌ని.. ప్ర‌జ‌లే త‌న స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ని అన్నారు. పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటు వేస్తే మ‌ళ్లీ మోస‌పోవ‌డ‌మే అని తాన ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ఆగిపోతాయ‌ని అన్నారు. చంద్ర‌బాబు నాయుడుకి పొర‌పాటున ఓటు వేస్తే చంద్ర‌ముఖ‌ని మ‌నమే వెళ్లి ఇంటికి పిలిపించుకోవ‌డం లాంటింద‌ని విమ‌ర్శించారు.

సైకిల్ ఇంటి బ‌య‌టే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలంటూ తెలుగు దేశం (Telugu Desam Party), జ‌న‌సేన పార్టీల గుర్తుల‌పై సెటైర్లు వేసారు. ఈసారి 175 సీట్ల‌కు 175.. 25 ఎంపీల‌కు 25 సీట్లు గెల‌వ‌డానికి అంతా సిద్ధ‌మే అని అన్నారు. త్వ‌ర‌లో YSRCP మేనిఫోస్టో విడుద‌ల చేస్తామ‌ని.. కానీ చెయ్య‌గ‌లిగేవే చెప్తాను కానీ చంద్ర‌బాబు నాయుడు లాగా చెయ్య‌లేనివి అసాధ్య‌మైన‌వి మాత్రం అస్స‌లు చెప్ప‌న‌ని అన్నారు. జ‌గ‌న్ మాట ఇచ్చాడంటే త‌గ్గేదేలేదు అని అన్నారు. ఏపీలో ప్రారంభించిన ప‌రిపాల‌న ఓ స్వ‌ర్ణ‌యుగానికి దారితీస్తోందని తెలిపారు.