గుణశేఖర్​ డైరెక్షన్లో మరో మైథలాజికల్​ సినిమా!

టాలీవుడ్​లో ఒక్కో దర్శకుడిదీ ఒక్కో స్టైల్​. పూరీ జగన్నాథ్​ మాస్​కి పెట్టింది పేరైతే, వి.వి.వినాయక్​ యాక్షన్​కి మారుపేరు. ఇక, కృష్ణవంశీ, శ్రీను వైట్ల, కొరటాల శివ, బోయపాటి శ్రీనివాస్​, వంశీ పైడిపల్లి.. వీళ్లంతా అటు ఫ్యామిలీతోపాటు ఇటు యాక్షన్​నీ జోడించి ప్రేక్షకులను మెప్పిస్తారు. దర్శకధీరుడు రాజమౌళి అద్భుతమైన విజువల్స్​ని జోడించి మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​, సుకుమార్​ క్లాస్​గా మాస్​ని ఎలివేట్​ చేయడంలో దిట్టలుగా పేరు తెచ్చుకున్నారు. అనిల్ రావిపూడి, మారుతి కామెడీతో మెప్పించే దర్శకులు.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో పంథాని ఫాలో అవుతూ తెలుగుతోపాటు ఇతర భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటూ పాన్​ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తున్నారు. కాగా, ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్​ది ప్రత్యేక స్టైల్​. ఆయన దృష్టి, ఆలోచన అంతా పౌరాణికాలు, చరిత్ర, బంధాలు, బంధుత్వాలు, సంస్కృతి, సంప్రదాయాల మీదనే ఉంటుంది. అదే ఆయన సినిమాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
చిన్న పిల్లలతో రామాయణం వంటి ఇతిహాసాన్ని తెరకెక్కించాలన్నా.. రుద్రమదేవి లాంటి చారిత్రక సినిమా తీయాలన్నా గుణశేఖర్​కే చెల్లింది. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా శాకుంతలం. సమంత, దేవ్‌ మోహన్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదలకానుంది.

ఈ సినిమా తర్వాత గుణశేఖర్​ నెక్ట్​ ప్రాజెక్ట్‌ ఏమిటనే దానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాకుంతలం సినిమా తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ను మళ్లీ పట్టాలెక్కించబోతున్నారని తెలుస్తోంది. ‘హిరణ్య కశ్యప’ అనే టైటిల్‌తో మరో పౌరాణిక సినిమా తీయడానికి ప్లాన్ చేశారు గుణ. ఈ ప్రాజెక్ట్‌ పై ఇప్పటికే మూడేళ్లు పని చేశారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ పక్కన పెట్టారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌, స్క్రిప్ట్ వర్క్‌ పై చాలా కాలం పని చేసిన తర్వాత టైటిల్‌ రోల్‌ కోసం రానాని సెలక్ట్ చేశారు. రానా కూడా ఆ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈలోపే కరోనా కారణంగా పరిస్ధితులు మారిపోయాయి. మరోవైపు రానా కూడా కొద్దిగా అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ప్రాజెక్ట్‌ కొద్ది రోజులు పక్కకు పెట్టాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దాంతో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో సమంత ముఖ్య పాత్రలో శాకుంతలం సినిమా తెరకెక్కించారు గుణశేఖర్. అలా శాకుంతలం ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. శాకుంతలం రిలీజ్​ తర్వాత ‘హిరణ్య కశ్యప’ను పూర్తి చేయాలనుకుంటున్నారట గుణశేఖర్. అయితే టైటిల్ రోల్‌ను రానా చెయ్యడం లేదని, మరొకరిని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమానే గుణశేఖర్​ స్వయంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే తెలుగు ప్రేక్షకులకు గుణ శేఖర్​ డైరెక్షన్​లో మరో మైథలాజికల్​ మూవీని చూసే అదృష్టం దక్కుతుందన్నమాట.