BJP తొలి జాబితాలో.. కంగనా రనౌత్, అక్షయ్‌ కుమార్‌..?

BJP: బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్ (Akshay Kumar), కంగనా రనౌత్.. (Kangana Ranaut) వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అధికార బీజేపీ తరఫున వీరిద్దరూ ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ విడుదల చేయనున్న తొలి జాబితాలోనే వీరిద్దరి పేర్లు ఉండనున్నాయని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్షయ్, కంగనా పోటీ చేసే నియోజక వర్గాలను కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంతకీ వీళ్లిద్దరూ ఏ స్థానాల నుంచి పోటీ చేయనున్నారంటే?

మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దేశంలో ఎన్నికల హడావుడి ప్రారంభం అయింది. ఎప్పుడెప్పుడు ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేస్తుందా అని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల వేట, పోటీ చేసే అభ్యర్థుల జాబితా, ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అందరికంటే ముందే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇటీవలె సుదీర్ఘ భేటీ నిర్వహించింది. త్వరలోనే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడనుంది. ఇందులో సెలబ్రిటీల పేర్లు కూడా ఉండనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ALSO READ: AP Elections: 9 సీట్ల‌కు BJPతో డీల్‌ ఓకే..?!

BJP పార్టీకి.. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి కంగనా రనౌత్‌, అక్షయ్‌ కుమార్‌ అనుకూలంగా ఉంటూ.. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడాన్ని మనం ఇప్పటికే ఎన్నోసార్లు చూశాం. ఈ క్రమంలోనే దేశంలోనే సెలబ్రిటీలుగా ఉన్న వారిద్దరినీ పార్టీలో చేర్చుకుని.. వారిని లోక్‌సభ బరిలో నిలపాలని బీజేపీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో విడుదల చేయనున్న ఫస్ట్ జాబితాలో వీరి పేర్లు ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ పోటీ చేసే నియోజక వర్గాలను కూడా బీజేపీ హై కమాండ్ నిర్ణయించినట్లు కూడా కొన్ని నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఢిల్లీలోని చాందినీ చౌక్‌ నుంచి అక్షయ్‌ కుమార్‌ను ఎన్నికల బరిలోకి దించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి కంగనా రనౌత్‌ను నిలబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ వైపు.. రాజకీయాల వైపు రానున్నట్లు కంగనా రనౌత్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే ఆమె ఎంట్రీ ఖాయంగానే కనిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయం అంటూ ఇటీవల కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే కంగనా బీజేపీలో చేరితే స్వాగతిస్తామని గతంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొనడం గమనార్హం. మరోవైపు.. అక్షయ్‌ కుమార్‌ కూడా పలు సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి మద్దతుగా మాట్లాడటం విశేషం.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుకు ప్రధాని మోదీ సారథ్యంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఇటీవల కీలక సమావేశం నిర్వహించింది. అభ్యర్థుల తొలి జాబితాను సత్వరం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా 110కి పైగా పేర్లు ప్రకటించనున్నట్లు సమాచారం. చాలా చోట్ల సిట్టింగ్‌ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. కొత్త ముఖాలకూ అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది.