అందుకే మేకప్​ వేసుకోను

మొదటి సినిమాతోనే ‘భానుమతి.. సింగిల్​ పీస్​’ అంటూ తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి. మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్​’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయిపల్లవి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువమంది అభిమానుల్ని సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటున్నారంటే తెలుగులో ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో తన నటన, డ్యాన్స్ తో  ప్రేక్షకులని మెప్పించడమే కాక, తన మంచి మనసు, మాటలు, మిగతా హీరోయిన్స్​లా అతి చేయకుండా సింపుల్​గా ఉండటం, అందరినీ గౌరవించడం, ఆప్యాయంగా పలకరించటం.. ఇవన్నీ కూడా పల్లవిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.

సాయి పల్లవి ఎక్కువగా మేకప్ వేసుకోదు, అతిగా రెడీ అవదు, సినిమాల్లో కూడా మేకప్ లేకుండానే నటిస్తుంది. అంతేకాదు, ఓ ఫెయిర్ నెస్ క్రీం యాడ్ ఆఫర్ వచ్చినా చేయలేదు. తను అబద్దం చెప్పలేనంటూ కోట్ల రూపాయల విలువ చేసే యాడ్​ని వదిలేయడం సాయిపల్లవిని సినీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.  తాజాగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు వెల్ల‌డించింది

ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆత్మ‌న్యూన‌త‌గా ఫీల్ అయ్యేదాన్ని. నా వాయిస్ బాగోదు, నా ఫేస్ బాగోదు, నా ఫేస్ పై పింపుల్స్, నేను కనిపించే తీరు.. ఇవన్నీ నన్ను భయపెట్టేవి. మొదటి నుంచి కూడా నా ఫేస్ అలా ఉండటంతో నేను ఎలాంటి మేకప్స్ వాడలేదు. కానీ హీరోయిన్ గా నా మొదటి సినిమా దర్శకుడు నాలో ఏదో స్పెషల్ ఉందని గ్రహించి నాకు ఛాన్స్ ఇచ్చాడు. నా మొదటి సినిమాలో కూడా నేను మేకప్ వేసుకోలేదు. ఆ సినిమాకు చాలా మంచి పేరు వచ్చింది. తెరపై నన్ను చూసి ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ఆ తర్వాత నన్ను ప్రేక్షకులు మరింత ఇష్టపడ్డారు. తెరపై నన్ను చూసినప్పుడు చప్పట్లు, ఈలలు వేశారు. అది వాస్తవంగా జరిగింది. నాకు వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ప్రేక్షకులు మన అందాన్ని చూసి ప్రేమించరు, మనం బయట ఎలా ఉంటాం అనే దాన్ని కూడా చూస్తారని నాకు అర్థమైంది. అది నన్ను మరింత కాన్ఫిడెంట్ గా మార్చింది. ఒక వ్యక్తిగా నాకు మరింత ఆత్మవిశ్వాసం ఇచ్చింది ప్రేక్షకులే. నా మొదటి సినిమా ప్రేమమ్ దర్శకుడు ఆల్ఫోన్స్ కారణంగానే నేను ఇక్కడిదాకా వచ్చాను, ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది తెలంగాణ భానుమతి.

తెలుగులో సాయి పల్లవి  చివరిసారిగా గార్గి సినిమాలో నటించింది. ప్రస్తుతం సాయి పల్లవి ఒక సినిమాలో మాత్రమే నటిస్తోంది. అయితే ఎంబీబీఎస్​ చదివిన సాయి పల్లవి సినిమాలు మానేసిందని, డాక్టర్​గా కొనసాగేందుకే మొగ్గు చూపుతుందని  వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల గురించి సాయి పల్లవి స్పందించలేదు. అభిమానులు మాత్రం పల్లవి సినిమాలు చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.