ఆ సినిమాతో సౌత్​లో నా కెరీర్​ ముగిసిపోయింది

బొంబాయి, ఒకేఒక్కడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్​   హీరోయిన్​ మనీషా కొయిరాలా. హిందీతోపాటు  పలు భాషల్లో నటించి పాపులర్​ హీరోయిన్​గా ఎదిగారు మనీషా. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న మనీషా.. నాలుగు ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు అందుకున్నారు. నేపాల్ ప్రభుత్వం అందించే రెండో అత్యున్నత పురస్కారాన్ని2001లో అందుకున్నారు. స్కూల్‌ డేస్‌ నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న మనీషాకు ఆ రోజుల్లోనే నేపాలీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 1991లో వచ్చిన ‘సౌదాగర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

దక్షిణాదిలోనూ పలు సినిమాల్లో నటించిన మనీషా, ‘బాబా’ సినిమాలో రజినీకాంత్​కి జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మనీషా సౌత్‌లో సినిమాలేవీ చేయలేదు. సూపర్‌ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలైంది. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్​గా మిగిలింది. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనీషా బాబా సినిమా గురించి సంచలన  వ్యాఖ్యలు చేశారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బాబా.. బహుశా నా చివరి పెద్ద తమిళ సినిమా. ఆ రోజుల్లో చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే భారీ డిజాస్టర్. బాబా సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. అది ఫ్లాప్ అయినప్పుడు,  నాసౌత్ కెరీర్ క్లోజ్ అయ్యింది అనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే జరిగింది. ‘బాబా’లో నటించడానికి ముందు చాలా సౌత్ ప్రాజెక్టులు నా చేతిలో ఉన్నాయి. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో అవకాశాలు ఆగిపోయాయి’ అని చెప్పుకొచ్చారు మనీషా.

‘బాబా’ సినిమా మొదటిసారి విడుదలైనప్పుడు ఘోరంగా విఫలమైంది. కాగా, పోయినేడాది రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. అప్పుడు మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘బాబా’ చిత్రంలో నటించడంతో పాటు ఆయనే నిర్మించారు. సినిమా కథ, స్ర్కీన్ ప్లే కూడా తానే రాశారు. ఈ చిత్ర  కథాంశం నాస్తికుడైన ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. నిజానికి హిమాలయ సాధువు ఆయన పునర్జన్మలో నాస్తికుడైన యువకుడిగా జన్మిస్తాడు. ఆ తర్వాత పునర్జన్మ పొందినట్లు తెలుసుకుంటాడు. చక్కటి కథ అయినప్పటికీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. ఇప్పుడు మనీషా ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు వైరల్​గా మారాయి. రజినీకంత్​ సరసన చేసేందుకు ఇప్పటికీ చాలామంది స్టార్​ హీరోయిన్​లు అవకాశం కోసం వేచి చూస్తుండగా, మనీషా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీస్తోంది.

ఇక, మనీషా కొయిరాలా చివరిగా కార్తీక్ ఆర్యన్ నటించిన ‘షెహజాదా’లో కనిపించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయలేదు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హీరామండి’ సినిమాలో మనీషా నటిస్తున్నారు.