Virat Kohli: మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విరాట్ దంప‌తులు.. పేరేంటో తెలుసా?

Virat Kohli: విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు శుభవార్త చెప్పారు. తాము మరోసారి తల్లిదండ్రులు అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు బాబు పుట్టాడని పేర్కొన్నారు. జూనియర్‌ విరాట్‌ పేరు అకాయ్‌ (Akaai) అని పెట్టినట్లు వెల్లడించారు. విరుష్క దంపతులకు ఇప్పటికే ఒక పాప ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు వామిక. వామికకు తమ్ముడు వచ్చాడంటూ కోహ్లీ, అనుష్క దంపతలు పోస్టు చేశారు. దీంతో వారికి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎందుకు దూరమయ్యాడు? అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. కోహ్లీ స్నేహితుడు ఇటీవల చెప్పినట్లుగానే విరుష్క (Virushka) దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా విరాట్ కోహ్ల, అనుష్క శర్మలు ప్రకటన విడుదల చేశారు. వామికకు (Vamika) తమ్ముడు వచ్చేశాడని అందులో పేర్కొన్నారు. జూనియర్‌ విరాట్‌ కోహ్లీకి “అకాయ్‌” అని పేరు పెట్టినట్లు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వెల్లడించారు. ‘మా జీవితంలోని ఈ మధురమైన క్షణాల్లో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో మా ప్రైవసీని గౌరవించండి’ అంటూ రాసుకొచ్చారు.

ALSO READ: Virat Kohli లేకపోవడం ఏ జట్టుకు అయినా పెద్ద ఎదురుదెబ్బే..!

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ప్రకటనల పట్ల సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ కంగ్రాంట్స్‌ చెబుతున్నారు. బుల్లి కోహ్లీ వచ్చేశాడు అంటూ పేర్కొంటున్నారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ నుంచి విరాట్‌ కోహ్లీ తప్పుకున్న విషయం తెలసిందే. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. అతడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే కోహ్లీ ఎందుకు దూరమయ్యాడనే కచ్చితమైన కారణాన్ని మాత్రం చెప్పలేదు.

2023 వరల్డ్​కప్​లో సమయంలో విరాట్- అనుష్క బెంగళూరులోని ఓ హోటల్​కు డిన్నర్​కు వెళ్లారు. అప్పుడు అనుష్క ప్రెగ్నెంట్ అని, బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుందని పలు కథనాలు వచ్చాయి. అప్పటినుంచి విరాట్- అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారన్న వార్తలు ప్రారంభమయ్యాయి. ఇక రీసెంట్​గా ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​ నుంచి విరాట్ తప్పుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రీసెంట్​గా తన యూట్యూబ్​ ఛానెల్​లో ఓ సందర్భంలో ‘మై ఫ్రెండ్ విరాట్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు’ అని చెప్పాడు. దీంతో విరాట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, తర్వాత రెండు రోజులకే డివిలియర్స్ తన వ్యాఖ్యల పట్ల యూటర్న్ తీసుకున్నాడు. ‘నేను పెద్ద పొరపాటు చేశాను. తప్పుడు సమాచారాన్ని షేర్ చేశాను. అదంతా అబద్ధం. విరాట్- అనుష్క విషయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆట నుంచి విరామం తీసుకోవడానికి కారణమేదైనా, అతడు తొందరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నా’ అని డివిలియర్స్ చెప్పాడు.

అయితే కోహ్లీ దంపతులు లండన్‌లో ఉన్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. రెండో బిడ్డ జననం సందర్భంగా అక్కడికి వెళ్లినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక విరాట్ స్వయంగా తన కుమారుడి గురించి ప్రకటిండం వల్ల ఈ సస్పెన్స్​కు తెరపడింది.