Bird Flu: ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. చికెన్‌ షాపులు బంద్‌

Bird Flu: నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోంది. వారం రోజులుగా పొదలకూరు, కోవూరు మండలాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృత్యువాత పడిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి, భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజ్‌స్‌ ల్యాబ్‌కు పంపారు. చనిపోయిన కోళ్లకు ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ ఫ్లూ) అనే వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి, కోళ్లలో వ్యాధి నిర్ధారణ చేస్తున్నట్లు వివరించారు.

ఏపీలో ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా(బర్డ్‌ ఫ్లూ) వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పోలీసు, రెవెన్యూ, అటవీ, పశుసంవర్ధకశాఖల ఆధ్వర్యంలో 721 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు ఏర్పాటు చేశామని పశుసంవర్ధకశాఖ తెలిపింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల, కోవూరు మండలం గుమ్మలదిబ్బలో కోళ్ల మరణాలకు సంబంధించి.. నమూనాలను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపగా ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి సోకినట్లు నిర్ధారించారని పేర్కొన్నారు. చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేశామన్నారు.

చాటగొట్లలో బర్డ్ ఫ్లూతో వేల కోళ్ళు మరణించాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో బాయిలర్, లేయర్, నాటుకోళ్ళు కూడా ఉన్నాయని తెలిపారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో చాటగొట్ల, దాని పక్కనున్న గ్రామాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇన్నాళ్ళు తెలియకుండా చికెన్ తిన్న తమకు ఏమవుతుందో ఆని ఆందోళన చెందుతున్నారు. అయితే బర్డ్‌ఫ్లూ వ్యాపించకుండా అత్యవసర చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ చెబుతున్నారు. పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలాల్లో శానిటైజేషన్ చేయించామని చెప్పారు. గ్రామాల్లో ప్రజలు కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలని…చాలా అవసరమైతే తప్ప బయట ౠహారం తినొద్దని హెచ్చరిస్తున్నారు.

ప్రభావిత గ్రామాలకు చుట్టూ కిలోమీటరు వరకు ఇన్‌ఫెక్టెడ్‌ జోన్‌గా, పది కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్‌ ప్రాంతంగా ప్రకటించినట్లు వివరించారు. కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలు కట్టడి చేశామన్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కోళ్లలో అసాధారణ మరణాలు లేవని తెలిపారు. రాష్ట్రంలో కోళ్లు అధికంగా ఉండే కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలతో పాటు వలస పక్షులు వచ్చే నెల్లూరు, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బర్డ్‌ ఫ్లూ అదుపులోనే ఉందని.. ఎవరికైనా అనుమానాలు ఉంటే 1962 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈ వ్యాధి సోకిన చాటగొట్ల, గుమ్మలదిబ్బ గ్రామాలకు కిలో మీటరు ప్రాంతాన్ని ఇన్‌ఫెక్టెడ్‌ జోన్‌గా, 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్‌ ప్రాంతంగా ప్రకటించారు. ఈ గ్రామాలకు కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసి, ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లతో కోళ్లలో వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలు చేపట్టారు. ఫ్లో సోకిన ప్రాంతంలో కిలో మీటర్ల పరిధిలో ఉన్న ఫౌల్ట్రీలలో మూడు నెలల పాటూ కోళ్లను బయటకు పంపొద్దని.. అలాగే ఆ ప్రాంతానికి కొత్త కోళ్లను తీసుకురావొద్దని సూచించారు.. అలాగే చికెన్ షాపుల్ని కూడా మూసివేయాలంటున్నారు. అలాగే ఫ్లో సోకిన ప్రాంతానికి 10 కిలో మీటర్ల పరిధిలో మూడు రోజులు పాటూ ఈ నిబంధనల్ని అమలు చేయాలని సూచించారు.