భార్య కోసం ఏడేళ్ల బాలికను బ‌లిచ్చాడు

ప్రపంచం రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతూ అభివృద్ధి పథంలో కొన్ని చోట్ల మాత్రం ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. సాకేంతికతతో సర్వం సాధించగలిగే ఆధునిక యుగంలోనూ నరబలులు, చేతబడులు అంటూ కొందరు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా కోల్‌కతాలో ఇటువంటి దారుణ ఘటన వెలుగు చూసింది. ఏడేళ్ల మైనర్ బాలికను దారుణంగా హతమార్చాడు ఓ దుర్మార్గుడు. తన భార్యకు గర్భస్రావం కాకుండా ఉండేందుకు మంత్రగాడి సలహాతో పక్కింట్లో ఉండే బాలికను నరబలి ఇచ్చాడు. గర్భవతి అయిన తన భార్య ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించేందుకు ఒక బిడ్డను బలి ఇచ్చాడని పోలీసులు తెలిపారు. అంతకుముందు రోజు బాలికను కిడ్నాప్ చేసిన హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. అదే భవనం నుండి మైనర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి లైంగిక వేధింపులకు గురైందా లేదా అన్నది నిర్ధారించేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.

బీహార్‌కు చెందిన అలోక్ కుమార్ భార్యకు మూడుసార్లు గర్భస్రావమైంది. ఆమె మళ్లీ గర్భం దాల్చింది. . తన భార్యకు మూడుసార్లు గర్భస్రావాలు జరగడంతో ఆ వ్యక్తి డిప్రెషన్‌కు గురయ్యాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆమె మళ్లీ గర్భం దాల్చినప్పుడు, ఆ వ్యక్తి తాంత్రికుడి సహాయం తీసుకున్నాడు. ఒక చిన్నారిని నరబలి ఇస్తే ఆమె గర్భం నిలుస్తుందని ఆ మంత్రగాడు చెప్పాడు. దీంతో అలోక్‌ కుమార్‌, ఆదివారం సాయంత్రం పొరుగున ఉండే ఏడేళ్ల బాలికను కిడ్నాప్‌ చేశాడు. నరబలి పేరుతో దారుణంగా హత్య చేశాడు. అతని సూచనలను గుడ్డిగా అనుసరించాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అలోక్ కుమార్‌ను అరెస్ట్‌ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.