నెల్లూరు YCP రెబల్‌ ఎమ్మెల్యేలకు అనిల్ కుమార్ యాదవ్ మాస్‌ కౌంటర్‌!

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పార్టీ నుంచి టికెట్టు తెచ్చుకుని తాను కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెడతానని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ శపథం చేశారు. ఈ సందర్బంగా వైసీపీ నుంచి సస్సెండ్‌కు గురైన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రమోహన్‌ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డికి అనిల్‌ కుమారు స్టైల్‌లో మాస్‌ కౌంటర్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురికీ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఒకవేళ ముగ్గూరు గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే.. రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతానని… అదే తాను గెలిచి అసెంబ్లీకి వస్తే.. మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా అని అసమ్మతి ఎమ్మెల్యేలకు సవాల్‌ విసిరారు. రానున్న ఎన్నికల్లో కోటంరెడ్డి, ఆనం, మేకపాటికి ఓటమి తప్పదని గట్టిగా చెప్పారు. 2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందాం అని అన్నారు. ఈ సారి అనిల్ ను శాసనసభకు రానీయమంటూ కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని.. ఇటీవల పసుపు కండువా కప్పుకున్న కొందరు జిల్లాలో పదికి పది స్థానాలు సాధిస్తామని చెబుతున్నారని.. పది స్థానాలు కాదు… ముందు మీ ముగ్గురు గెలవండి చూద్దాం అని అనిల్‌ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని.. గెలిచి చూపిస్తా అన్నారు. ఎవరైన దమ్ముంటే ఆపండి.. చూద్దాం అంటూ రెచ్చిపోయారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లడం వల్ల జిల్లాలో వైసీపీకి ఊడిందేమీ లేదని సీఎం జగన్‌ వెంట కార్యకర్తలు, ప్రజలు ఉన్నారన్నారు.