KTR: ప్రజా దర్బార్ పొమ్మంటే BRS ఆదుకుంది

KTR: ప్రజల కష్ట సుఖాలు వింటాము, అండగా నిలబడతామంటూ అధికారం అందిన వారం రోజుల పాటు హడావిడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తోంది.

ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్‌కి చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్‌కి వచ్చింది. పత్రికల్లో, టీవీలలో ప్రజా దర్బార్ ప్రచార ఆర్భాటాన్ని చూసి నాలుగు సార్లు దరఖాస్తు ఇచ్చానని తెలిపింది. దరఖాస్తు తీసుకోవడం మినహా ఇంకా మిగిలిన సమాచారం కానీ స్పందన కానీ ఏ మాత్రం లేదని తెలిపింది. తన ఆర్థిక కష్టాలను, తన పిల్లల చదువుల ఇబ్బందులను, తన దుర్భరమైన జీవితాన్ని వివరించినా… ప్రజా దర్బార్‌లో ఊరట దక్కలేదని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ప్రజాదర్బార్లో నాలుగు సార్లు దరఖాస్తులు పెట్టుకున్న దయ తలచలేదని, అసెంబ్లీ వద్దకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రోజంతా కాపలా కాస్తే పోలీసులు పొమ్మన్నారని వాపోయింది.

అయితే చివరగా తెలంగాణ భవన్ వెళ్లి KCRను, KTRను కలిస్తే కొంత అండ దొరుకుతుందని కొంద‌రు చెప్ప‌డంతో తెలంగాణ భవన్ చేరుకున్నానని వివ‌రించింది. KTRని కలిసిన వెంటనే ఆయన త‌న‌ బాధ విని తన వ్యక్తిగత స్థాయిలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారని అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేసింది. సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన KTRకి అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.

అన్నపూర్ణ బాధలు విన్న తర్వాత, ఆమె కూతురు నర్సింగ్ చదువు కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని KTR అందించారు. బంజారా హిల్స్ లో ఉన్న తన ఇంటికి పిలుచుకొని మరి, చెక్కు అందించారు. తన కూతురు విద్య కోసం, కుటుంబ ఆర్థిక సహాయం కోసం సహకారం అందించిన KTRకి ధన్యవాదాలు తెలిపింది అన్నపూర్ణ.