Vande Bharat Train: సికింద్రాబాద్‌ – తిరుపతి

ఏపీ – తెలంగాణ మధ్య మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలోనే పరుగులు పెట్టనుంది. ఇప్పటికే సికింద్రబాద్‌ – వైజాగ్‌ మధ్య నడుస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మంచి స్పందన వస్తోంది. ఈక్రమంలో తిరుమల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య ఈ రైలు అందుబాటులోకి రానుందని రైల్వే వర్గాల సమాచారం. నిర్వహణపరమైన ఏర్పాట్లతో అందుకు సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే సంబంధిత రైల్వే డివిజన్ల అధికారులకు గురువారం రాత్రి సమాచారం అందించింది. వారంలో ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్‌ 8న ప్రారంభించే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌లో ప్రారంభించిన నేపథ్యంలో రెండోదాన్ని తిరుపతిలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ రైలు అందుబాటులోకి వస్తే తిరుమలకు వెళ్లి ఎంతోమంది భక్తులకు ఉపయుక్తంగా ఉంటుంది. దీంతోపాటు సమయం కూడా కలిసివస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రైలును తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి నాడు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడుస్తోంది. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి భక్తులు ప్రయాణిస్తుంటారు. మూడు నాలుగువారాల ముందు ప్రయత్నిస్తే తప్ప రిజర్వేషన్‌ దొరకదు. ఈనేపథ్యంలో ప్రయాణికుల నుంచి మంచి డిమాండ్‌ ఉండటంతో రైల్వేశాఖ సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించాలని నిర్ణయించింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి కాజీపేట-విజయవాడ, నల్గొండ-గుంటూరు, మహబూబ్‌నగర్‌-కర్నూలు, వికారాబాద్‌-తాండూరు-రాయచూరు.. ఇలా నాలుగు మార్గాల్లో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గంలో నడిపించాలని రైల్వేశాఖ భావిస్తోంది. అయితే ఈ రైలు ఏయే స్టేషన్లలో ఆగుతుంది, ఛార్జీలు ఎంత, ప్రయాణ సమయం ఎంత పడుతుంది అన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.