ఉత్తమ నటుడు పుర‌స్కారం అందుకున్న కల్యాణ్​ రామ్!​

నందమూరి నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చారు కల్యాణ్​ రామ్​. ‘తొలిచూపులోనే’ సినిమాతో కల్యాణ్​ టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతోంది. అటు హీరోగానూ, ఇటు నిర్మాతగానూ రాణిస్తున్నాడు కల్యాణ్​ రామ్​. తాత నందమూరి తారక రామారావు పేరుమీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారాడు. కాగా ఈ బ్యానర్‌పై ఎక్కువగా తన చిత్రాలనే నిర్మించి పలు విజయాలు అందుకున్నాడు. పోయిన ఏడాది ఎన్టీఆర్​ బ్యానర్‌లో రూపొందిన ‘బింబిసార’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించింది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో కన్నడ భామ సంయుక్త మీనన్​ హీరోయిన్​గా నటించింది. లాక్​డౌన్​ తర్వాత ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్​కి బాలకృష్ణ నటించిన అఖండ తర్వాత అంతటి ఘన విజయాన్ని అందించింది బింబిసార. పీరియాడికల్ డ్రామాగా రూపొందింన ‘బింబిసార’ టైమ్​ ట్రావెల్​ కాన్సెప్ట్​తో ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద క్రేజీ కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీకి కొత్త ఊపు తీసుకొచ్చింది.

కాగా, తాజాగా బింబిసార ఉగాది అవార్డ్స్‌తో సత్తా చాటింది. శ్రీకళాసుధ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బుధవారం 25వ ఉగాది అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో ‘బింబిసార’ ఉత్తమ చిత్రం అవార్డ్ గెలుచుకోగా.. కల్యాణ్ రామ్ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. చెన్నై, రాయపేటలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన ఈ వేడుకలకు నటుడు అలీ, తెలంగాణ మాజీ గవర్నర్​ నరసింహన్​, దర్శకుడు హను రాఘవపుడి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక అవార్డు అందుకున్న తర్వాత కల్యాణ్ రామ్ మాట్లాడుతూ… ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇక ‘బింబిసార’ సినిమా  టైమ్ ట్రావెల్‌, ఫాంటసీ అంశాల మిళితంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. దీని తర్వాత ఈ ఏడాది ‘అమిగోస్’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు కల్యాణ్ రామ్. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. డాపుల్ గ్యాంగర్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో ఆయన ట్రిపుల్ రోల్‌లో కనిపించారు. కల్యాణ్​ రామ్​ ప్రస్తుతం డెవిల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ఇక నిర్మాతగానూ రాణిస్తున్న కల్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్‌తో గతంలో ‘జై లవకుశ’ చిత్రం నిర్మించినప్పటికీ అంతగా విజయం సాధించలేదు. ఇక తాజాగా ప్రారంభమైన NTR30 చిత్రానికి కూడా కల్యాణ్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్​, జాన్వీ కపూర్​ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.