రాష్ట్రపతి నిలయాన్ని ఏడాదంతా చూడొచ్చు!

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాదిని పురస్కరించుకొని సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనార్థం వీలు కల్పించే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. దీంతో ఏడాది పాటు ప్రజలు రాష్ట్రపతి నిలయాన్ని తిలకించవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆహ్లాదాన్ని అనుభవించడంతోపాటు స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరుల త్యాగాలను ఈ తరం పిల్లలు, యువకులకు తెలిపేందుకు సందర్శన కార్యక్రమానికి అనుమతి ఇచ్చామన్నారు. అయితే… http://visit.rashtra pathibhavan.gov.in వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు. భారతీయులకు రూ.50, విదేశీయులకు రూ.250గా టికెట్టు ధర నిర్ణయించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని చూసేందుకు వచ్చే వారికి అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్ట్‌ గ్యాలరీ, కోర్ట్‌యార్డ్‌ ప్రాంతాలను ఆధునికీకరించింది. గతంలో ఏడాదికి 15 రోజులు మాత్రమే సందర్శనకు అనుమతి ఉండగా.. ప్రస్తుతం అనగా మార్చి 23 నుంచి సోమవారాలు, సెలవు రోజులు మినహా ఏడాదిలో మిగిలిన అన్ని రోజుల్లోనూ రాష్ట్రపతి నివాసాన్ని సందర్శించొచ్చు.