‘నష్టపోయిన రైతుకు 10 వేలు ఇస్తాం’

అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు.. గంటలో ఈ నిధులను విడుదల చేస్తామని తెలిపారు. వాస్తవానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని.. సహాయ పునరావాస చర్యలు అని అంటారని చెప్పారు.

రైతులు నిరాశ చెందొద్దు.. మేమున్నం..
‘గాలివాన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న 1,29,446, వరి 72,709 మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో ఉంది. జీఎస్‌డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్‌డీపీ పెరుగుదలతో వ్యవసాయం పాత్రే అధికంగా ఉంది. అద్భుతమైన వ్యవసాయం రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని.. ఇది మనకు చాలా గర్వకారణమని తెలిపారు. రైతులు ఏవిధంగా నిరాశకు గురికావద్దు.. ప్రభుత్వం అండదండగా ఉంటుందన్నారు.

కేంద్రంపై కేసీఆర్‌ నిప్పులు..
ఈ దేశంలో ఓ పద్ధతి, పాడు లేదు. ఇన్సూరెన్స్‌ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప రైతులకు లాభం చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు. పాత ప్రభుత్వాలు అంతే.. ఇప్పుడు కూడా అంతే.. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంది. వాళ్లకు చెప్పినా లాభం లేకుండా ఉంది. భారతదేశానికే కొత్త అగ్రికల్చర్‌ పాలసీ కావాలి. ఇప్పుడు ఒక డ్రామా నడుస్తోంది. మేం రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కమిటీ ఎప్పుడొస్తుందో.. రిపోర్టు ఎప్పుడిస్తుందో ఆ దేవుడికే ఎరుక. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా ఆర్నెల్ల దాకా రూపాయి రాదు. ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా ఉంది. వాళ్లకు రాజకీయాలు తప్ప ప్రజల్లేరు.. రైతులు లేరు. అందుకే కేంద్రానికి నివేదిక పంపాలని అనుకోవట్లేదు. గతంలో పంపిన దానికే రూపాయి ఇవ్వలేదు కాబట్టి నిరసనగా ఇప్పుడు నివేదిక పంపాలని అనుకోవడం లేదు. భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చిండు కాబట్టి మా రైతులను మేమే కాపాడుకుంటాం. వంద శాతం మేమే ఆదుకుంటాం.

నష్టపరిహారం కాదు.. పునరావాస చర్యలు అనాలి..
తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్‌, ఉచిత నీళ్లు, వాటర్‌ సెస్‌ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకోవడం వల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది. ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదు కాబట్టి ఈ రంగాన్ని నిర్వీర్యం కానివ్వం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. చాలామంది దీన్ని నష్టపరిహారం అని అంటారు. కానీ వీటిని సహాయ పునరావాస చర్యలు అని పిలవాలి. నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరూ ఇయ్యలేరు. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించాలి. అందుకే ఎకరానికి 10 వేలు ప్రకటిస్తున్నా అని అన్నారు. వెంటనే వీటిని అందజేస్తాం. స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటాం. రైతుతో పాటు కౌలు రైతులను కూడా పిలిపించి ఆదుకునేలా ఆదేశాలిస్తాం. ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దు. అని రైతుల్లో సీఎం కేసీఆర్‌ భరోసా నింపారు.