మరో యంగ్​ డైరెక్టర్​తో పవన్​ కల్యాణ్​ సినిమా!

అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​. ఇప్పటికే నాలుగు సినిమాల షూటింగ్​తో బిజీగా ఉన్న పవన్​ తాజాగా మరో సినిమాకు సైన్​ చేశారని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాకు పవన్​ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్​ ​మాటలు, స్క్రీన్​ప్లే అందించనున్నారట. అంతేకాదు త్రివిక్రమ్​ స్వయంగా ఆ డైరెక్టర్​కి కథ లైన్​ చెప్పి డెవలప్​ చేయమని సూచించారని తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్​ ఎవరో కాదు మాస్​ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రావణాసుర’ సినిమాను రూపొందిస్తున్న సుదీర్​ వర్మ.

స్వామి రారా సినిమాతో డైరెక్టర్​గా మారిన సుదీర్​ కేశవ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా మాస్​ మహారాజ్​ రవితేజతో రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్న సంగ‌తి తెలిసిందే. రావణాసుర ప్రమోష‌న‌ల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సుధీర్ వ‌ర్మ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా గురించి చెప్పటంతో ఓ క్లారిటీ వచ్చినట్టయింది. ఇంత‌కు ముందు నిఖిల్‌తో సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కించిన కేశ‌వ సినిమాకు చిన‌బాబు నిర్మాత‌. ఆ సినిమా న‌చ్చిన త్రివిక్రమ్ అప్పుడు ప్రత్యేకంగా సుధీర్ వ‌ర్మకు ఫోన్ చేసి ఓ పాయింట్ చెప్పి దానిపై క‌థ‌ను త‌యారు చేయ‌మ‌ని చెప్పార‌ని, అది ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో చేస్తామ‌ని కూడా చెప్పిన‌ట్లు సుధీర్ వ‌ర్మ తెలిపారు. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయం త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఇంత‌కు ముందుకు ప‌వ‌న్ కల్యాణ్​ నటించిన భీమ్లా నాయ‌క్ సినిమాకు కూడా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాట‌ల‌తో పాటు పాట‌లు రాసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాను సాగ‌ర్ కె.చంద్ర డైరెక్ట్ చేశారు. ఇప్పుడ‌దే స్టైల్లో సుధీర్ వ‌ర్మ సినిమాను సిద్ధం చేస్తున్నారన్నమాట.

అయితే ఇప్పటికే హ‌రి హ‌ర వీర మ‌ల్లు, స‌ముద్ర ఖ‌ని ద‌ర్శక‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో చేస్తోన్న సినిమాల‌తో పాటు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో చేస్తోన్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌, సుజిత్ ద‌ర్శక‌త్వంలో చేస్తోన్న ఓజీ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఈ సినిమాలతోనే పవన్​ చాలా బిజీగా ఉన్నారు. ఇక సుదీర్​ వర్మతో సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.