RRR: ఆస్కార్ పెర్ఫామెన్స్‌కి తార‌క్ నో చెప్పారా?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కు ఇంకా క్రేజ్ ద‌క్క‌లేదు. ఇటీవ‌ల అమెరికాలోని లాస్ఏంజెల్స్‌లో జ‌రిగిన ఆస్కార్స్ వేడుక‌లోనూ బెస్ట్ సాంగ్ కేట‌గిరీలో అవార్డు ద‌క్కించుకుంది. ఇప్ప‌టికీ ఈ పాట‌పై ఇంకా రీల్స్ చేస్తూనే ఉన్నారు. అయితే తెర‌పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ పాట‌కు వేసిన స్టెప్పుల‌ను.. ఆస్కార్ వేదిక‌పై కూడా క‌లిసి పెర్ఫాం చేస్తారేమోన‌ని ఫ్యాన్స్‌తో పాటు గ్లోబ‌ల్ ఆడియ‌న్స్ కూడా ఎంతో ఎదురుచూసారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఎందుకంటే.. లోక‌ల్ డ్యాన్స‌ర్ల‌తో ఆ పాటను ఆస్కార్ వేదిక‌పై పెర్ఫాం చేయించి స‌రిపెట్టుకున్నారు.

అయితే ఈ విష‌యంపై ఓ సంద‌ర్భంలో రామ్ చ‌ర‌ణ్ ప్రస్తావించారు. ఆస్కార్ స్టేజ్‌పై పెర్ఫాం చేయ‌డానికి తాను 100 శాతం రెడీగానే ఉన్నాన‌ని కానీ ఏం జ‌రిగిందో తెలీదని అన్నారు. “స్టేజ్‌పై నాటు నాటు డ్యాన్స్ చేయ‌డానికి నేను వంద‌శాతం సిద్ధంగానే ఉన్నాను. కానీ అలా ఎందుకు జ‌ర‌గలేదో నాకు తెలీదు. స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన వాళ్లు మాకంటే చాలా బాగా చేసారు. ఇక వేరే వాళ్లు డ్యాన్స్ వేస్తుండ‌గా రిలాక్స్ అవ‌తూ చూడ‌ట‌మే మా వంతు. నాటు నాటు ఇప్పుడు ఇండియన్ సాంగ్ అయిపోయింది” అని తెలిపారు. దీనిని బ‌ట్టి చూస్తే.. చ‌ర‌ణ్ పెర్ఫాం చేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ ఎన్టీఆర్ మాత్రం నో చెప్పి ఉంటార‌ని తెలుస్తోంది. తార‌క్ కుటుంబంలో జ‌రిగిన సంఘ‌ట‌న కార‌ణంగా ఆయ‌న బాగా డ‌ల్ అయిపోవ‌డం వ‌ల‌నో లేక వ‌ర్క్ ప్రెష‌ర్ వ‌ల‌నో.. ఆయ‌న పెర్ఫాం చేయ‌డానికి ఒప్పుకోలేక‌పోయారు. బ‌హుశా పెర్ఫామెన్స్‌కి ప్రాక్టీస్ చేయ‌డానికి స‌మ‌యం దొర‌క్కపోవ‌డం వ‌ల్ల ఎన్టీఆర్ వ‌ద్దు అని ఉంటార‌ని దాంతో చ‌ర‌ణ్ కూడా ఏమీ చేయ‌లేక మౌనంగా ఉండిపోయార‌ని ప‌లువురు నెటిజన్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.