KCR ఫ్యామిలీపై పంచ్ డైలాగుల‌తో ‘పొలిటికల్ పోస్టర్లు’!

హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి ‘పొలిటికల్ పోస్టర్లు’ కలకలం రేపాయి. ఇటీవల లిక్క‌ర్ స్కాం కేసులో క‌వితను ఈడీ విచారిస్తున్న స‌మ‌యంలో కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ల‌క్ష్యంగా చేసుకుని ఆ పార్టీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, పోస్టర్లను కొంద‌రు ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు.. కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా చేసుకుని ప్ర‌త్య‌ర్థులు రెచ్చిపోయారు. కేసీఆర్‌, కేటీఆర్‌, క‌విత‌ల‌ను టార్గెట్ చేస్తూ.. ప‌లు ప్రాంతాల్లో అంటించిన పోస్టర్లు సంచ‌ల‌నంగా మారాయి.

ఈసారి బీఆర్ఎస్ పార్టీ వ్య‌తిరేకులు రెచ్చిపోయారు. సినిమా డైలాగులు, కొన్ని స్లోగ‌న్న‌తో పోస్ట‌ర్ల‌ను న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో అంటించారు. అవి కాస్త సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. ‘కల్వకుంట్ల దొంగల ముఠా.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేసీఆర్’.. ‘కవిత అంటే పద్యం అనుకుంటిరా.. లే.. మద్యం’.. ‘కవితక్క నీకు కావాలి సారా దందాలో 33 శాతం వాటా.. దాని కోసమే ఆడుతున్నావ్ 33 శాతం మహిళా రిజర్వేషన్ ఆట’.. ‘తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకుని.. ఢిల్లీలో కవితక్క చేస్తోంది దొంగ సారా దందా’ అనే డైలాగుల‌తోపాటు.. పోస్ట‌ర్లు అదే త‌ర‌హాలో రూపొందించి గోడ‌ల‌పై అంటించారు. ఇవ‌న్నీ హైదరాబాద్ బేగంపేటలోని మెట్రో పిల్లర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. శనివారం ఉదయాన్నే ఈ పోస్టర్లు కనిపించాయి.

అధికార పార్టీకి వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు అంటించిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే వాటిని తొలగించారు. సీసీ కెమెరాలను పరిశీలించి.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా, ఇప్పుడు కవితకు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లలో ఎక్కడా ఊరు పేరు లేకపోవడం గమనార్హం.