TSPSC – పేపర్ల లీకేజీపై తొలిసారి స్పందించిన కేటీఆర్!

టీఎస్‌పీఎస్‌సీ పరీక్షా పత్రాల లీకేజీ అంశంపై మంత్రి కేటీఆర్‌ తొలిసారి స్పందించారు. రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా.. ఉద్యోగాల సాధనపైనే యువత దృష్టి పెట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇక ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బండి సంజయ్ రాజకీయ అజ్ఙాని అని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై అవగాహన లేని వ్యక్తి బండి సంజయ్ అని ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రభుత్వ శాఖ కాదని.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని అన్నారు. ఓ వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. గుజరాత్‌లో 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని అన్నారు. ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అని ప్రశ్నించారు.

బండి సంజయ్‌ ఏమన్నారంటే..

అంతకుముందు పేపర్ల లీకేజీ అంశంపై ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం డబ్బు పిచ్చి కారణంగా లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలు ఆగమయ్యాయని విమర్శించారు. పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారించడంతోపాటు కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు గన్ పార్క్ దగ్గర దీక్షకు దిగిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. సికింద్రాబాద్ కార్ఖాన పోలీస్ స్టేషన్ నుంచి కొద్ది సేపటి తర్వాత విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించకుండా లిక్కర్ స్కామ్ లో కవితను కాపాడుకోవడానికి మంత్రివర్గం మొత్తం ఢిల్లీకి వెళ్లిందని ఆయన విమర్శించారు.

వైఎస్‌ షర్మిల, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అరెస్టు..
తెలంగాణ వైఎస్సార్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, బీఎస్‌పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పరీక్ష పత్రాల లీకేజేకి సంబంధించి ఇవాళ టీఎస్‌పీఎస్సీ ముట్టడికి పూనుకున్న తరుణంలో ఉదయమే వారిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. నిరసన తెలియజేసేందుకు బయటకు రాకుండా వారిని ఇంట్లోని అడ్డుకున్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఇంటి గోడలు దూకి మరి పోలీసులు ఆయన ఇంట్లోకి వెళ్లి నోటీసులు అందజేశారు.