Oscar: చరిత్ర సృష్టించిన ‘ఏనుగుల క‌థ‌​’

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్​ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలు మన దేశానికి మరింత ప్రత్యేకంగా నిలిచాయి. ఎందుకంటే 95వ అకాడ‌మీ వేడుక‌ల్లో ఇండియాకు తొలి ఆస్కార్ అవార్డ్ ద‌క్కింది. బెస్ట్ డాక్యుమెంట‌ర్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ విజేత‌గా నిలిచిన‌ట్లు జ్యూరీ ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని గురునీత్ మోంగ నిర్మించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ని కార్తీక్ గోన్‌స్లేవ్స్ డైరెక్ట్ చేశారు. హాల్ ఔట్‌, మార్తా మిచెల్ ఎఫెక్ట్‌, స్ట్రేంజ‌ర్ ఎట్ ది గేట్‌ల‌తో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ పోటీ ప‌డి విజేత‌గా నిలిచింది. ఈ ఏడాది మ‌న దేశం త‌ర‌పున‌ తొలి అవార్డు ఈ షార్ట్ ఫిల్మ్ ద‌క్కించుకోవ‌టంతో దేశమంతా వేడుకలు జరుపుకుంటోంది.

మ‌దుమ‌లై నేష‌న‌ల్ పార్క్‌బ్యాక్‌డ్రాప్‌లో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ తెర‌కెక్కింది. బొమ్మ‌న్‌, బెల్లీ అనే దంపతులు ఓ ఏనుగు పిల్ల‌ను పెంచుకుంటారు. దానికి ర‌ఘు అనే పేరు పెట్టుకుంటారు. ఈ సినిమాలో వారి మ‌ధ్య అనుబంధాన్ని, ప్రేమ‌ను తెలియ‌జేయ‌ట‌మే, అడ‌వి అందాల‌ను అద్భుతంగా చూపించారు. 2022లో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ నెట్ ఫ్లిక్స్‌లో విడుద‌లైంది.
ఇక ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో RRR మూవీ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట పోటీపడి ఆస్కార్​ దక్కించుకుంది. అంతేకాదు ఆస్కార్ వేడుక‌ను ప్రారంభించ‌టానికి ముందే నాటు నాటు పాట‌ను వేదిక‌పై ప్ర‌ద‌ర్శించారు. ఈ లైవ్ పెర్ఫామెన్స్‌కి స్టేజ్ అదిరిపోయింది. ఆడియెన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. 1929లో ఆస్కార్ అవార్డులు మొదలైనప్పటి నుంచి మన భారతీయ చిత్రాలు అత్యధికంగా నామినేట్ అవ్వడం ఇదే మొదటిసారి.

95 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం పురస్కారం అందుకున్న తమిళ డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆ డాక్యుమెంటరీలో నటించిన ఏనుగులు అదృశ్యమయ్యాయనే వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీలో రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు అదృశ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఆ ఏనుగుల సంరక్షకుడు బొమ్మన్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించారు. కొంత మంది వ్యక్తులను తరుముతూ నిన్న ఈ రెండు ఏనుగులు కృష్ణగిరి అరణ్యంలోకి వెళ్లిపోయాయని చెప్పారు. ఆ ఏనుగుల కోసం సంరక్షకుడు ప్రస్తుతం వెతుకుతున్నరని తెలుస్తోంది.

‘మద్యం మత్తులో ఉన్న కొంత మంది వ్యక్తులను తరుముకుంటూ ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం నేను కృష్ణగిరి ఫారెస్ట్‌లో ఏనుగుల కోసం గాలిస్తున్నాను. అవి రెండూ కలిసే ఉన్నాయా.. విడిపోయి తిరుగుతున్నాయా అనే విషయంలో నాకు ఎలాంటి స్పష్టత లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటి ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ అవి నాకు కనిపించకపోతే ఫారెస్ట్ రేంజర్‌కి ఫిర్యాదు చేసి నేను నా సొంతూరికి వెళ్లిపోతాను’ అని బొమ్మన్ వెల్లడించారు.