KomatiReddy Venkat Reddy: BRS ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు తాక‌నివ్వ‌ను

Hyderabad: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో BRS నుండి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు కాంగ్రెస్ ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి (komatireddy venkat reddy). ఈసారి జ‌ర‌గబోయే తెలంగాణ ఎన్నిక‌ల్లో (telangana elections) కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు కోమ‌టిరెడ్డి. కర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింద‌ని, ఇటీవ‌ల చేసిన స‌ర్వేల్లోనూ కాంగ్రెస్‌కే ఎక్కువ ఓటు శాతం క‌నిపిస్తోంద‌ని కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి న‌ల్ల‌గొండ నుంచి పోటీ చేస్తే గెలుపు త‌న‌దేన‌ని అంటున్నారు. మ‌రోప‌క్క‌ ప‌క్క కాంగ్రెస్ (congress) పార్టీలోనే అంత‌ర్గ‌త విభేదాలు ఉన్నాయ‌ని క్లియ‌ర్‌గా స్పష్టం అవుతోంది. ఖమ్మం సభ నేపథ్యంలో  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన పోస్టర్‌ కలకలం సృష్టించింది. ఖమ్మంలో సభకు కార్యకర్తలు తరలిరావాలంటూ కోమటిరెడ్డి విడుదల చేసిన పోస్టర్‌లో TPCC చీఫ్‌ రేవంత్ రెడ్డి (revanth reddy) ఫొటో లేకపోవడం వారిద్దరి మధ్య విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది.

రేవంత్‌రెడ్డిని గుర్తించడం లేదంటూ గతంలో వ్యాఖ్యానించిన వెంకట్‌రెడ్డి ఈ పోస్టర్‌ విషయంలో అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు. తన ఫొటోతోపాటు పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఫొటోలను కూడా ముద్రించినప్పటికీ, రేవంత్‌రెడ్డి ఫొటోకు మాత్రం స్థానం ఇవ్వలేదు. ఇటీవల నల్లగొండలో సాగిన భట్టి పాదయాత్రకు కూడా కోమటిరెడ్డి దూరంగానే ఉన్నారు. స్వయంగా భట్టి ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఫొటో లేకుండా విడుదల చేసిన పోస్టర్‌ పార్టీలో అంతర్గత కలహాలను మరోసారి బయటపెట్టింది. ఖమ్మంలోనూ ఇదే తరహా ప్రచార యుద్ధం జ‌రుగుతోంది.