Narendra Modi: ప్రధానిని పొగిడినందుకు చంపేసాడు..!

Uttarpradesh: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని (narendra modi) పొగిడినందుకు ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మీర్జాపూర్‌లో (mirzapur) చోటుచేసుకుంది. కోలాహి గ్రామానికి చెందిన రాజేష్‌ అనే వ్య‌క్తి నిన్న సాయంత్రం ఓ పెళ్లికి వెళ్లాడు. పెళ్లి కార్య‌క్ర‌మాలు అన్నీ పూర్త‌య్యాక రాజేష్ త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓ బొలెరో బుక్ చేసుకుని తిరిగి ఇంటికి ప్ర‌యాణ‌మ‌య్యారు. కారులో వెళ్తుండ‌గా రాజ‌కీయాల టాపిక్ వ‌చ్చింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ల పాల‌న గురించి రాజేష్ గొప్ప‌గా చెప్పాడు. అది కారు న‌డుపుతున్న డ్రైవ‌ర్‌కు న‌చ్చ‌లేదు. వారి పాల‌న బాలేద‌ని ఈసారి ఎన్నిక‌ల్లో మోదీ ప్ర‌భుత్వానికి ఓటు వెయ్యన‌ని చెప్పాడు. పైగా మోదీని యోగి ఆదిత్య‌నాథ్‌ల గురించి త‌ప్పుగా మాట్లాడాడు.

అలా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. కోపంతో ఆ డ్రైవ‌ర్ రాజేష్‌ను బ‌ల‌వంతంగా బండి నుంచి దించేసాడు. దాంతో రాజేష్ కూడా నన్ను వ‌దిలేసి ఎలా వెళ్తావో చూస్తా అంటూ రోడ్డుకు అడ్డంగా కూర్చున్నాడు. కారులో ఉన్న మిగ‌తావారు ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ డ్రైవ‌ర్ రాజేష్‌పై నుంచి కారు పోనిచ్చాడు. పైగా 20 మీట‌ర్ల పాటు అత‌న్ని లాక్కెళ్లాడు. తీవ్ర గాయాలు కావ‌డంతో రాజేష్ అక్కడిక‌క్క‌డే చ‌నిపోయాడు. దాంతో ఆ డ్రైవ‌ర్ కారును అక్క‌డే వ‌దిలేసి పారిపోయాడు. మిగ‌తావారు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. దాదాపు 6 గంట‌ల్లో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.