Sajjala: వివేకా కేసులో రాజకీయ కోణం లేదు

Hyderabad: వివేకా కేసులో CBI విచారణలో రాజకీయ కోణం ఎక్కడా లేద‌ని YCP రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) పేర్కొన్నారు. విచారణను పక్కదారి పట్టించేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎల్లోమీడియా చర్చలు పెట్టిందని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని, వ్యవస్థను కించపరిచేలా ఒక మూకలా తయారై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మీడియా పరిధులు దాటి వ్యహరిస్తోందని విమర్శించారు. జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్‌, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసేలా చర్చలు చేపట్టిందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి ఎల్లో మీడియా ప్రయత్నించిందని.. దర్యాప్తునకు సంబంధించిన అంశాలు వారికెలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో సజ్జల రామ‌కృష్ణారెడ్డి తాడేపల్లి పార్టీ కార్యలాయంలో మీడియాతో మాట్లాడారు.

“వైయస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడాల్సి వచ్చిందంటే.. వైయస్‌ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐ విచారణ చేపట్టినప్పటి నుంచి వరసగా జరుగుతున్న పరిణామాలు కానీ, లేదా దానికి సంబంధించి దర్యాప్తు ఏం జరుగుతుందో తెలియదు కానీ, ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియాలో అంటే ఏబీఎన్, టీవీ5, ఈనాడు, మహాన్యూస్‌ చానల్స్‌ విచారణను ప్రభావితం చేసేలా ఒపెన్‌ డిబెట్లు పెట్టడం, తప్పుడు ప్రచారం చేయడం  చేశారు. వైయస్‌ జగన్‌ను ప్రజాక్షేతంలో ఎదుర్కొనే సత్తా లేని టీడీపీ, చంద్రబాబును రక్షించేందుకు ఈ కేసు సీబీఐ విచారణ మొదలైనప్పటి నుంచి ఓ వర్గం మీడియాలో ఎక్కువైంది. ఆ ప్రాసెస్‌లో భాగంగా ఈ రోజు మీడియా ప్రస్తావన కూడా కోర్టు తీర్పులో వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది” అని సజ్జల పేర్కొన్నారు