AP Elections: ముందస్తు ఎన్నికలు సాధ్యమేనా.. జగన్‌ స్పీడ్‌కి కారణం?

vijayawada: ఏపీలో ముందస్తు ఎన్నికలు (ap elections) వస్తాయని ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. ఇటీవల సీఎం జగన్‌ (cm jagan) ఢిల్లీ టూర్‌కు వెళ్లడం అక్కడ అనేకమంది బీజేపీ పెద్దలను ఆయన కలిశారు. మరోవైపు కేంద్రం కూడా వైసీపీ ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరితోనే ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణతోపాటు ముందస్తు ఎన్నికలకు జగన్‌ వెళ్తారు అనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే.. సీఎం జగన్‌ గతంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ జగన్‌ ఢిల్లీ టూర్‌ తర్వాత… వచ్చే నెల 7న కేబినెట్‌ మీట్‌ నిర్వహించాలని భావిస్తుండటంతో మరోసారి ముందస్తు అనే వార్తలు ఊపందుకుకున్నాయి.

ఏపీలో ఇదీ పరిస్థితి… 
వాస్తవానికి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే.. దానికి తగ్గట్లు ఏర్పాట్లు కనీసం ఆరు నెలల నుంచి మొదలవ్వాలి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బందోబస్తు, ఉద్యోగుల కేటాయింపు, బూత్‌లను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతేకాకుండా.. ఓటర్ల జాబితా సిద్దం చేయడం అందులో మార్పులు, చేర్పులు చేయడం వంటి పనులు ఎన్నికల ముందుకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. కానీ ఏపీలో ఇలాంటి ప్రక్రియలు ఏమీ మొదలు కాలేదు. దీంతో ముందస్తు ఎన్నికలు అనేది వాస్తవం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ వెళ్తే.. అధికార ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు.