‘ది కేరళ స్టోరీ’ సినిమాపై కమల్​ హాసన్ కామెంట్స్​​!

Chennai: విడుదలకు ముందునుంచే అనేక వివాదాలను ఎదుర్కొంటున్న సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story). మే 5న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో విమర్శల మధ్యే మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వంలో హీరోయిన్ అదా శర్మ(Adah Sharma) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే విడుదలకు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ మూవీపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యూనివర్సల్​ స్టార్​ కమల్ హాసన్(Kamal Haasan). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ది కేరళ స్టోరీ వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

‘నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. నాకు ప్రచార చిత్రాలు నచ్చవు. అలాంటి వాటికి పూర్తిగా నేను వ్యతిరేకిని. సినిమా టైటిల్ కింద నిజమైన కథ అని రాయగానే సరిపోదు. అలా రాసినంత మాత్రన అది నిజంగా జరిగిన కథ అవ్వదు’ అని అన్నారు. ఇక ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా, ఈ సినిమా ప్రదర్శన ముందు తప్పనిసరిగా డిస్ల్కేమర్​ నోట్​ వేయాలి ఇటీవలే సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

కాగా, కమల్​ ప్రస్తుతం కోలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ శంకర్​ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్​ 2 సినిమాలో నటిస్తున్నారు. భారతీయుడు సినిమాకు సీక్వెల్​గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్​కు జోడీగా కాజల్​ అగర్వాల్​ నటిస్తోంది.