Preethi Reddy: మైనంప‌ల్లి.. ఇది క‌రెక్ట్ కాదు

Preethi Reddy: మ‌ల్లారెడ్డి అగ్రిక‌ల్చ‌రల్ సైన్సెస్ సంస్థ అధినేత్రి, మ‌ల్లారెడ్డి (Malla Reddy) కోడ‌లు ప్రీతి రెడ్డి కాంగ్రెస్ నేత మైనంపల్లి హ‌నుమంత‌రావుపై (Mynampally Hanumanth Rao) మండిప‌డ్డారు. కాలేజ్‌కు చెందిన వ‌రుస‌గా ఐదు సార్లు ఫెయిల్ అయిన‌ 25 మంది విద్యార్ధుల‌ను అటెండెన్స్ త‌క్కువ‌గా ఉంద‌ని డీటైన్ చేయ‌డంతో మైనంప‌ల్లి కాలేజ్ ఎదుట ధ‌ర్నా చేసారు. కాలేజ్ సామాగ్రికి నిప్పు పెట్టించారు. దీనిపై ప్రీతి రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. స్టూడెంట్స్, వారి త‌ల్లిదండ్రులు, కాలేజ్ మేనేజ్‌మెంట్ ద‌గ్గ‌ర జ‌ర‌గాల్సిన అంశాన్ని మైనంప‌ల్లి రాజ‌కీయం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

అస‌లు కాలేజ్‌లోకి మైనంపల్లి ఎందుకు వ‌చ్చిన‌ట్లు అని మండిప‌డ్డారు. ఆయ‌న విద్యా శాఖ మంత్రి కాన‌ప్పుడు కాలేజ్‌లో ఏం ప‌ని అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. కాలేజ్‌లో 70 వేల మంది విద్యార్ధులు ఉన్నార‌ని.. వారిలో 20 మంది వ‌రుస‌గా ఫెయిల్ అవుతూ వస్తున్నందుకు డీటైన్ చేసామ‌ని తెలిపారు. తెలంగాణ‌లో ఏ ఒక్క కాలేజ్‌లోనూ జ‌ర‌గ‌ని విధంగా మ‌ల్లారెడ్డి కాలేజ్‌లో జ‌రిగిన‌ట్లు మైనంప‌ల్లి మాట్లాడుతున్నార‌ని ఆమె ఆగ్రహం వ్య‌క్తం చేసారు. కాలేజ్‌పై ఎలాంటి అనుమానాలు ఉన్నా ఇన్‌స్పెక్ష‌న్ చేసుకోవచ్చ‌ని పేర్కొన్నారు.