Ravindra Jadeja: కుటుంబంలో క‌ల‌హాలు.. అస‌లేం జ‌రిగింది?

Ravindra Jadeja: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఆయన తండ్రి అనిరుధ్ సిన్హా జడేజా (Anirudh Sinha Jadeja) చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. కొడకు రవీంద్ర జడేజా , కోడలు రివాబాపై (Rivaba Jadeja) అనిరుధ్ సిన్హా విమర్శలు చేశారు. తన కొడుకును క్రికెటర్‌ను చేసి పెద్ద తప్పు చేశానని, లేకపోతే తన కొడుకు తన దగ్గరే ఉండేవాడని ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ అన్న మాటలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై రివాబా జడేజా ఘాటుగా స్పందించారు.

తనపై మామ చేసిన ఆరోపణలకు మీడియా అడిగిన ప్రశ్నలకు క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా ఘాటుగా స్పందించారు. ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె.. వ్యక్తిగత విషయాలను చర్చించడానిక ఇది వేదిక కాదని గుర్తుచేశారు. ‘ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం.. మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను నేరుగా సంప్రదించవచ్చు’ అని మీడియా అడిగి ప్రశ్నకు రివాబా గట్టిగా బదులిచ్చారు.

అటు, తండ్రి ఆరోపణలను రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా తోసిపుచ్చారు. ఏకపక్షంగా ఉన్న ఆ ఆరోపణలను నేను ఖండిస్తున్నానని, ఇది ముందస్తు ప్రణాళికతో రూపొందిన ఇంటర్వ్యూ అని మండిపడ్డారు. అంతేకాదు, నా భార్య ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు కుట్రపూరితంగా ఇంటర్వ్యూ చేశారని, నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ బహిరంగ వేదికల్లో అవన్నీ వెల్లడించలేనని పేర్కొన్నాడు.

ఇక, రివాబాతో జడేజాకు 2016లో పెళ్లి ఇరు కుటుంబాల అంగీకారంతోనే జరిగింది. రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రివాబా బీజేపీలో చేరి, అంచెలంచెలుగా ఎదిగి, 2022 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌ నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింహ్, సోదరి నైనాబా.. అతడి పెళ్లికి ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రివాబాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయినా, రివాబా విజయం సాధించారు. పండంటి కుటుంబంలో రాజకీయాలు చిచ్చు పెట్టినట్లు చర్చ జరుగుతోంది.

కాగా, ఓ ఇంటర్వ్యూలో జడేజా తండ్రి అనిరుధ్ సిన్హా చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారిన విషయం తెలిసిందే. జడేజాకు రివాబాతో పెళ్లయిన దగ్గర్నుంచి తమ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని ఆయన ఆరోపించారు. పెళ్లైన రెండు మూడు నెలలకే ఆస్తులన్నీ తన పేరు మీదికి మార్చాలని డిమాండ్‌ చేసిందని, వేరు కాపురానికే ఇష్టపడిందని ఆయన ఆరోపించారు. జడేజాకు పెళ్లి చేయకపోయి ఉంటే బాగుండేదని అనిరుధ్‌ వ్యాఖ్యానించారు.

”నేను మీకు ఒక్క నిజం చెప్పాలనుకుంటున్నా, రవీంద్ర, అతడి భార్య రివాబాతో నాకు ఎటువంటి సంబంధం లేదు.. మేము వారికి ఫోన్ చేయం.. వారు మాకు కాల్ చేయరు. వారికి పెళ్లయిన రెండు మూడు నెలల తర్వాత సమస్యలు మొదలయ్యాయి.” అని అనిరుధ్ సిన్హా చెప్పారు. ‘‘జడ్డూ డబ్బులు సంపాదించాక మేం బిజినెస్‌ స్టార్ట్‌ చేశాం. నా కుమార్తె నైనాబా నుంచి రివాబా బిజినెస్‌ను లాక్కోవడం.. మేం విడిపోయేందుకు కారణమైంది. రివాబా పేరెంట్స్‌ జడేజా విషయంలో అతిగా జోక్యం చేసుకుంటారు.

రవీంద్ర జడేజా డబ్బుతో వారు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. నేను ప్రస్తుతం జామ్‌నగర్‌లో ఒంటరిగా నివసిస్తున్నాను.. రవీంద్ర అదే నగరంలోని వేరుగా ఉంటున్నాడు.. మా కోడలు రివాబా తన కుమారుడిపై ఏమి మాయాజాలం చేసిందో నాకు తెలియదు… వాడు నా కొడుకు.. అది నా గుండెల్ని మండిస్తోంది.. వాడు క్రికెటర్‌గా మారకుండా ఉంటే బాగుండేది.. అలా అయితే ఇవన్నీ అనుభవించాల్సిన అవసరం లేదు’ అని జడేజా తండ్రి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయ్యింది.